మార్కెట్ పతనం, రూ.3.7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. నిన్న 871 పాయింట్లకు పైగా నష్టాల్లో క్లోజ్ అయిన సెన్సెక్స్ నేడు మరో 740 పాయింట్లు పతనమైంది. ఈ రెండు రోజుల్లోనే 1600 పాయింట్లకు పైగా నష్టపోయింది. నేడు ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.3.69 హరించుకుపోయింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.198.78 లక్షల కోట్లకు పడిపోయింది.
సెన్సెక్స్ 49,201.98 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,247.95 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,236.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 740.19 (1.51%) పాయింట్లు దిగజారి 48,440 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,570.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,575.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,264.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 224.50 (1.54%) పాయింట్లు నష్టపోయి 14,324.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. బుధవారం దేశంలో 47,262 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత నాలుగు నెలల కాలంలో ఇదే అత్యధికం. ఇది అమ్మకాలు వెల్లువెత్తడానికి కారణమైంది.