ఈక్విటీ ఫండ్స్ నుండి రూ.4,534 కోట్లు వెనక్కి, డెట్ ఫండ్స్ నుండి కూడా
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుండి ఇన్వెస్టర్లు ఫిబ్రవరి నెలలో భారీగా వెనక్కి తీసుకున్నారు. వీటి నుండి వరుసగా ఎనిమిదో నెల వెనక్కి తరలి వెళ్ళాయి. ఈక్విటీ మార్కెట్లు ఇటీవల సరికొత్త శిఖరాలను తాకడంతో పాటు తక్కువ కాలంలో రికార్డ్స్థాయిలో పరుగులు పెట్టడంతో మార్కెట్ మరోసారి దిద్దుబాటుకు గురవుతుందనే ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో ఈక్విటి ఎంఎఫ్లు వెనక్కి వెళ్తున్నాయి. డెబిట్ మ్యూచువల్ ఫండ్స్ ఔట్ ఫ్లో కూడా కనిపిస్తోంది. గత ఏడాది కరోనా అనంతరం మార్కెట్లు కుప్పకూలాయి. ఆ తర్వాత క్రమంగా పుంజుకొని, ఇటీవల పరుగులు పెడుతున్నాయి.
వరుసగా ఎనిమిదో నెల
ఈక్విటీ మ్యూచ్వల్ ఫండ్ పథకాల నుంచి వరుసగా 8వ నెల ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరిలో ఫండ్ పథకాల నుంచి రూ.4,534 కోట్ల ఉపసంహరణలు ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచ్వల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) గణాంకాల ఆధారంగా వెల్లడవుతోంది. స్టాక్ మార్కెట్ ఇటీవల పరుగులు పెట్టడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమే ప్రధాన కారణమని, అలాగే కరెక్షన్ ఉండవచ్చునని భావిస్తున్నారని, అందుకే పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నట్లు చెబుతున్నారు.
డెట్ ఫండ్ పథకాల్లోకి..
ఇక, డెట్ ఫండ్ పథకాల్లోకి రూ.1735 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత నెలలో అన్ని రకాల ఫండ్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.1,843 కోట్ల పెట్టుబడుల్ని మదుపర్లు వెనక్కి తీసుకున్నారు. జనవరిలో ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్న పెట్టుబడుల వ్యాల్యూ రూ.35,568 కోట్లు.
పెట్టుబడులు ఇలా
ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత ఫండ్ స్కీమ్ నుండి 2021 ఫిబ్రవరిలో రూ.4534 కోట్లు, జనవరిలో రూ.9,253 కోట్లు, 2020 డిసెంబర్లో రూ.10,147 కోట్లు, నవంబర్లో రూ.12,917 కోట్లు, అక్టోబర్లో రూ.2,725 కోట్లు, సెప్టెంబర్లో రూ.734 కోట్లు, ఆగస్ట్లో రూ.4,000 కోట్లు, జులైలో రూ.2,480 కోట్లు మేర పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. 2020 జూన్ నెలలో ఈక్విటీ ఫండ్ పథకాల్లోకి రూ.240.55 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.