రెండ్రోజుల్లో రూ.6 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు, కారణాలివే
స్టాక్ మార్కెట్లు రెండో రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. నిన్న దాదాపు స్థిరంగా ప్రారంభమై, రోజంతా స్వల్ప నష్టాల్లో కనిపించి, చివరి గంటలో మాత్రం కుప్పకూలింది. అయితే నేడు ఉదయం నుండి నష్టాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. మధ్యాహ్నం 12.30 సమయంలో సెన్సెక్స్ 60,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఆ తర్వాత అతి స్వల్పంగా కోలుకుంది. అయినప్పటికీ చివరకు భారీ నష్టాల్లోనే ముగిసింది. రెండు రోజుల్లోనే సెన్సెక్స్ 1200 పాయింట్లు క్షీణించింది. నేడు (బుధవారం, జనవరి 18) సెన్సెక్స్ 60,000 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 18,000 పాయింట్ల దిగువకు వచ్చింది.
రెండు రోజుల్లో రూ.6.5 లక్షల కోట్లు
సెన్సెక్స్ నిన్న 554 పాయింట్లు నష్టపోగా, నేడు 656 పాయింట్లు క్షీణించింది. రెండు రోజుల్లో 1200 పాయింట్లకు పైగా పతనమైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా క్షీణించింది. రెండు రోజుల్లో ఇన్వెస్టర్లు రూ.6.5 లక్షల కోట్లు నష్టపోయారు. బుధవారం ఓ సమయంలో 800 పాయింట్ల మేర కూడా పతనమైంది. సోమవారం గరిష్టం 61,385 పాయింట్ల నుండి 1400 పాయింట్ల మేర పడిపోయింది. సోమవారం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,80,02,438 కోట్లు కాగా, ఇప్పుడు రూ.2,73,51,571కు పడిపోయింది.
అందుకే నష్టాలు
ఒమిక్రాన్ ప్రభావం, హుతి దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యోల్భణం పెరుగుతోంది. యూఎస్ టెన్ ఇయర్ యీల్డ్స్ 1.89 శాతం లాభపడి దాదాపు రెండేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. అమెరికా ఫెడ్ రేట్లు ఈ క్యాలెండర్ ఏడాదిలో మూడుసార్లు పెంచనుంది. ఈ ప్రభావం పడింది. మొదటి రేటు హైక్ మార్చిలో ఉండనుంది. మరోవైపు, యూఏఈ ఆయిల్ ట్యాంకర్స్ పైన దాడి తర్వాత చమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ ఏడాది రెండో అర్ధ సంవత్సరం నాటికి చమురు ధరలు 100 డాలర్లకు చేరుకోవచ్చునని గోల్డ్ మన్ శాక్స్ అంచనా వేసింది. ఇది అంతర్జాతీయ మార్కెట్ పైన తదనుగుణంగా దేశీయ మార్కెట్ పైన ప్రభావం చూపింది. అలాగే, అంతర్జాతీయ విమాన సేవలపై కొనసాగుతున్న నిషేధాన్ని డీజీసీఏ ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది.
దిగ్గజ కంపెనీలు నేడు నష్టపోయాయి. ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, HDFC ద్వయం, ఇన్ఫోసిస్, టీసీఎస్, HUL వంటివి మార్కెట్ను కిందకు లాగాయి. కొద్ది నెలల క్రితం లిస్ట్ అయిన పేటీఎం ఐదు శాతం మేర కుంగింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఓఎన్జీసీ, టాటా మోటార్స్, కోల్ ఇండియా, ఎస్బీఐ, హిండాల్కో ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఇన్ఫోసిస్, శ్రీ సిమెంట్స్, ఏషియన్ పేయింట్స్, HUL, గ్రాసీమ్ ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్, టాటా మోటార్స్, రిలయన్స్ ఉన్నాయి.