11 ఏళ్లలో ఓ రోజులో బిగ్గెస్ట్ గెయిన్, 2 రోజుల్లో రూ.7 లక్షల కోట్లు: మళ్లీ TCSను దాటిన రిలయన్స్
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళ, బుధవారాలు భారీ లాభాల్లోకి వచ్చాయి. అమెరికా సెనేట్, ప్రభుత్వం 2 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీతో అంతర్జాతీయ మార్కెట్లు కుదురుకోవడం, అలాగే మోడీ ప్రభుత్వం చర్యలు మన మార్కెట్లపై ప్రభావం చూపింది. సెన్సెక్స్ బుధవారం ఒక్కరోజే 1862 పాయింట్లు దూసుకెళ్లింది. దీంతో ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు.
Covid-19: GoAir ఉద్యోగుల ఉద్యోగులకు షాక్, శాలరీలో కోత, 24 రోజులు పని చేసినా...
11 ఏళ్లలో ఓ రోజులో అతిపెద్ద లాభం
బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు 7 శాతానికి పైగా ర్యాలీ సాధించాయి. 11 సంవత్సరాల తర్వాత సెన్సెక్స్ ఓ రోజులో అతిపెద్ద ర్యాలీ చేసింది. సెన్సెక్స్లో 30 షేర్లు 6.98 శాతం, నిఫ్టీ 50 షేర్లు 6.62 శాతం ర్యాలీ సాధించాయి. రెండు రోజులుగా మార్కెట్లు భారీ ర్యాలీ సాధిస్తున్నప్పటికీ ఈ ఏడాది రికార్డ్ ర్యాలీతో పోలిస్తే సెన్సెక్స్ 30.8 శాతం, నిఫ్టీ 31.8 శాతం తక్కువే ఉన్నాయి.
మంగళవారం నాటి లాభాలతో
మంగళవారం సెన్సెక్స్ స్వల్ప లాభాలతో ముగిసిన సమయంలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.1.82 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే BSEలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,82,770 కోట్లు పెరిగి రూ.103.69 లక్షల కోట్లకు చేరుకుంది. బుధవారం సెన్సెక్స్ ఏకంగా 1800 పాయింట్లకు పేగా పెరిగింది. నిఫ్టీ 517 పాయింట్లు పెరిగింది. దీంతో నిన్న (25 మార్చి) ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.4.7 లక్షల కోట్లు పెరిగింది. దీంతో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ 108.41 లక్షల కోట్లకు పెరిగింది.
రెండు రోజుల్లో దాదాపు రూ.7 లక్షల కోట్ల సంపద పెరిగింది
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండు రోజులు లాభాల్లోనే ముగియడంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.7 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ ఈ రెండు రోజుల్లో 2,555 పాయింట్లు ఎగబాకింది. బీఎస్ఈలో నమోదైన మొత్తం సంస్థల మార్కెట్ విలువ రెండు రోజుల్లో రూ.6,63,240.78 కోట్లు పెరిగింది.
మళ్లీ విలువైన సంస్థగా రిలయన్స్
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోవడంతో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. బుధవారం కంపెనీ షేర్ ధర అమాంతం పెరిగింది. దీంతో టీసీఎస్ను దాటేసి అత్యంత విలువైన సంస్థగా మళ్లీ అవతరించింది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి షేరు14.65% పెరిగి రూ.1,081.25కు చేరుకుంది. ఇంట్రాడేలో 22.25% లాభపడింది. కానీ దానిని నిలుపుకోలేదు. ఎన్ఎస్ఈలోనూ కంపెనీ షేరు 13.82% ఎగబాకి రూ.1,074 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 87,576.98 కోట్లు పెరిగి రూ.6,85,433.30 కోట్లకు చేరుకుంది.