ఒక్కరోజులో రూ.3.43 లక్షల కోట్లు లాభపడిన ఇన్వెస్టర్లు, మొత్తం మార్కెట్ క్యాప్ ఎంతంటే
ముంబై: స్టాక్ మార్కెట్లు రెండు రోజుల భారీ నష్టాల అనంతరం అంతే భారీగా లాభపడ్డాయి. నేడు (జనవరి 19, మంగళవారం) సెన్సెక్స్ 834.02 పాయింట్లు లేదా 1.72% ఎగబాకి 49,398.29 పాయింట్ల వద్ద, నిఫ్టీ 239.90 పాయింట్లు లేదా 1.68% ఎగిసి 14,521.20 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. అన్ని రంగాలు కూడా పైకెగిశాయి. రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, HDFC ట్విన్స్ వంటి హెవీ వెయిట్స్ భారీగా లాభపడ్డాయి. దీంతో సూచీలు హైజంప్ చేశాయి. సెన్సెక్స్ గత రెండు రోజుల్లో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోగా, నిన్న 80 శాతానికి కవర్ అయింది.
రెండ్రోజుల నష్టం ఒక్కరోజులో: సెన్సెక్స్ 834 పాయింట్లు జంప్: రిలయన్స్ సహా హెవీవెయిట్స్ అదుర్స్
మార్కెట్ క్యాప్ రూ.196.20 లక్షల కోట్లు
సెన్సెక్స్ నేడు 830 పాయింట్లకు పైగా లాభపడటంతో ఇన్వెస్టర్స్ ఆదాయం రూ.3.43 లక్షల కోట్లు పెరిగింది. గత నాలుగు నెలల కాలంలో సూచీలు ఒకరోజులోనే అత్యధికంగా లాభపడ్డాయి. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.196.20 లక్షల కోట్లకు పెరిగింది. క్రితం సెషన్లో ఇది రూ.192.77 లక్షల కోట్లుగా నమోదయింది. బలమైన అంతర్జాతీయ సూచీలు, వ్యాక్సినేషన్, 2 రోజుల పాటు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు, నేడు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. నేడు సెన్సెక్స్ 834 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 239 పాయింట్లు ఎగిసి 14,521 పాయింట్లకు చేరుకుంది.
2021 జనవరిలో...
2021 కొత్త ఏడాది ప్రారంభమై 19 రోజులు. ఈ పద్నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 1,646 పాయింట్లు లేదా 3.45 శాతం లాభపడింది. ఈ కొత్త సంవత్సరంలో నిఫ్టీ 3.86 శాతం లేదా 539 పాయింట్లు ఎగిసింది. నేడు సెన్సెక్స్ టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, HDFC, ఎల్ అండ్ టీ, ICICI బ్యాంకు స్టాక్స్ ఉన్నాయి. నేటి లూజర్స్లో టెక్ మహీంద్రా, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి. 30 స్టాక్ ఇండెక్స్ సూచీ 0.54 శాతం క్షీణించింది.
రెండు రోజుల నష్టం.. నేడు లాభం
గత శుక్రవారం మార్కెట్ నష్టంతో ఇన్వెస్టర్లు ఆ ఒక్కరోజు రూ.2.23 లక్షల కోట్లు నష్టపోయారు. నిన్న 470 పాయింట్ల నష్టంతో రూ.2.7 లక్షల కోట్ల మొత్తాన్ని ఇన్వెస్టర్లు కోల్పోయారు. ఇన్వెస్టర్లు క్రితం రెండు సెషన్లలో ప్రాఫిట్ బుకింగ్కు ఎగబడటంతో సూచీలు నేలచూపులు చూశాయి. దీంతో దాదాపు రూ.5 లక్షల కోట్లు నష్టపోయారు. నేడు రూ.3.43 లక్షల కోట్లు పెరిగింది.