రీస్కిల్-రీస్టార్ట్, 500 మంది ఉద్యోగుల్ని తీసుకోనున్న ఇన్ఫోసిస్
భారత రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మరో కీలక ప్రకటన చేసింది. 2023 నాటికి అమెరికాలోని రోడ్ ఐస్లాండ్లో 500 మంది ఉద్యోగులను అదనంగా తీసుకుంటామని గురువారం వెల్లడించింది. ఇన్ఫోసిస్ గత ఏడాది రోడ్ ఐస్లాండ్ ప్రొవిడెన్స్ నగరంలో డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడ క్రమంగా ఉద్యోగులను పెంచుకోవడనికి సిద్ధమైంది. ఇందులో భాగంగా మూడేళ్లలో ఇక్కడే 500 మందిని తీసుకుంటామని తెలిపింది.
ఇన్ఫోసిస్కు సంబంధించి మరిన్ని వార్తలు
రీస్కిల్ అండ్ రీస్టార్ట్ ప్రోగ్రాం
ఇన్ఫోసిస్ గత మూడేళ్లలో రోడ్ ఐస్లాండ్తో పాటు ఇండియానా, నార్త్ కరోలినా, కనెక్టికట్, టెక్సాస్, అరిజోనాలలో ఆరు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కొత్త ఉద్యోగులు టెక్ పోకస్డ్ రోల్స్లో వివిధ పాత్రల్లో పని చేస్తారని ఐటీ దిగ్గజం తెలిపింది. ఇటీవలే రీస్కిల్ అండ్ రీస్టార్ట్ ప్రోగ్రాంను ప్రారంభించింది. కొత్త ఉద్యోగులను, శిక్షణ ఉద్యోగులను తీసుకోవడానికి దీనిని ప్రారంభించింది. కరోనా మహమ్మారి కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ వైరస్ కారణంగా ప్రభావితమైన ఉద్యోగులకు రీస్కిల్ లక్ష్యంగా ప్రారంభించింది.
ఇది కీలక సెంటర్
రోడ్ ఐస్లాండ్లో ఇన్ఫోసిస్ రెండేళ్ల క్రితమే ఈ సెంటర్ను ప్రారంభించినప్పటికీ ఈ కేంద్రం కంపెనీకి కీలకమని స్థానిక గవర్నర్ గినా రైమోండో తెలిపారు. 500 కొత్త ఉద్యోగాలు సృష్టించడంతో పాటు ఇప్పటికే మన రాష్ట్రానికి ఈ కంపెనీ చేసిన కృషికి కృతజ్జతలు అన్నారు. ఇన్ఫోసిస్ కంపెనీకి ఉత్తర అమెరికా అతిపెద్ద మార్కెట్. కంపెనీ ఆదాయంలో 61.5 శాతం ఇక్కడి నుండి ఉంటుంది. ఆ తర్వాత యూరోప్ నుండి 24 శాతం, ఇతర ప్రపంచం నుండి 11.6 శాతం, ఇండియా ఆదాయం 2.9 శాతంగా ఉంటుంది. ఇది జూన్ 30, 2020 రికార్డు ప్రకారం. జూన్ క్వార్టర్ నాటికి ఇన్ఫోసిస్లో దాదాపు 2 లక్షల 40వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు.
ఇటీవలే ఉద్యోగాలపై ప్రకటన
అమెరికాలో రానున్న రెండేళ్లలో 12000 మంది ఉద్యోగులను తీసుకుంటామని ఇన్ఫోసిస్ ఇటీవల ప్రకటించింది. వచ్చే అయిదు సంవత్సరాలలో 25వేల మందిని నియమించుకుంటామని వెల్లడించింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఐటీ కంపెనీలు మరింతమంది స్థానికులను నియమించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయిదేళ్లలో ఇరవై ఐదువేల మందిని అమెరికాలో నియమించుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. అమెరికన్లకు రెండేళ్లలో 10వేల ఉద్యోగాలు ఇవ్వాలని 2017లో తొలుత ఇన్ఫోసిస్ నిర్ణయించింది. ఆ తర్వాత 13000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పుడు వీటికి అదనంగా మరో పన్నెండు వేలమందిని తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఎక్స్పీరియన్స్ కలిగిన వృత్తి నిపుణులతో పాటు ప్రముఖ విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుండి తాజా పట్టభద్రులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది.