గంటలో రూ.50,000 కోట్లు: ఇన్వెస్టర్ల పంట పండింది, రాకెట్లా ఇన్ఫోసిస్ షేర్
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఉదయం గం.9.30 సమయానికి సెన్సెక్స్ నిఫ్టీ సింగిల్ డిజిట్ నష్టంలో ఉండగా, ఆ తర్వాత పుంజుకుంది. స్వల్ప లాభాల్లోకి వచ్చింది. మధ్యాహ్నం గం.2.47 సమయానికి సెన్సెక్స్ 190.21 (0.53%) పాయింట్లు లాభపడి 36,242.02 వద్ద, నిఫ్టీ 78.75 (0.74%) పాయింట్లు పెరిగి 10,696.95 వద్ద ట్రేడ్ అయింది. టాప్ గెయినర్స్ జాబితాలో ఈ రోజు ఇన్ఫోసిస్ ముందుంది. ఇన్ఫోసిస్, బీపీసీఎల్, సిప్లా, మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ టాప్ గెయినర్స్ జాబితాలో ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, జీ ఎంటర్టైన్మెంట్, ఎన్టీపీసీ ఉన్నాయి.
ఇన్ఫోసిస్ 1.74 బిలియన్ డాలర్ల భారీ డీల్స్, కొత్తగా 20,000 ఉద్యోగాలు
ఇన్ఫోసిస్ షేర్ రాకెట్ వేగం
భారత్ రెండో అతిపెద్ద టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ అంచనాలకు మించి రాణించడంతో గురువారం ఆ షేర్ ధర రాకెట్లా దూసుకుపోయింది. ఉదయం ప్రారంభ ట్రేడింగ్ నుండి ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. అంతేకాదు, కరోనా కష్టకాలంలో మెగా డీల్స్ కుదిరాయనే ప్రకటన ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. క్రితం ముగింపు రూ.831.45 వద్ద ముగిసిన ఈ షేర్ ఈ రోజు ఆరంభంలోనే రూ.900 వద్ద మొదలైంది. గంట సమయంలో ఏకంగా రూ.950కు చేరుకుంది. అప్పర్ లిమిట్ రూ.955 సమీపానికి చేరుకుంది. ఆ తర్వాత ముగింపుకు ముందు 9.50 శాతం పెరుగుదలతో రూ.909.60 వద్ద నిలిచింది.
రూ.50,000 కోట్ల ఎం-క్యాప్
కంపెనీ షేర్ ధర ఓ సమయంలో ఏకంగా 15 శాతం పెరగడంతో కంపెనీ మార్కెట్ వ్యాల్యూ గంటలోనే రూ.50 వేల కోట్లు పెరిగింది. అయితే అప్పర్ లిమిట్ (రూ.955)ను తాకుతుందని భావించినప్పటికీ ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు ఆసక్తి చూపించారు. ఇన్వెస్టర్ల పంట పండింది. దీంతో మధ్యాహ్నం గం.12.30 నుండి రూ.905 నుండి రూ.9.10కి మధ్య తచ్చాడింది.
విప్రో, టీసీఎస్లను బీట్ చేసిన ఇన్ఫీ..
2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ (ఏప్రిల్-జూన్)లో ఇన్ఫోసిస్ అంచనాలకు మించి లాభాలు నమోదు చేసింది. ఏకీకృత ప్రాతిపదికన రూ.4,233 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.3,802గా నమోదయింది. అంటే అప్పటి లాభంతో పోలిస్తే 12 శాతం ఎక్కువ. అదే సమయంలో 1.74 బిలియన్ డాలర్ల వ్యాపార ఒప్పందాలు ఉన్నట్లు ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇది 1.65 బిలియన్ డాలర్లుగా ఉంది. కంపెనీ రెవెన్యూ 8.5 శాతం పెరిగి రూ.23,665కు పెరిగింది. దీంతో బుధవారమే ఈ కంపెనీ షేర్ 6 శాతం లాభపడి రూ.831 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ ఎం-క్యాప్ రూ.20,563.41 కోట్లకు పెరిగింది. గత వారం టీసీఎస్ ఫలితాలు ప్రకటించింది. క్వార్టర్ ప్రాతిపదికన రెవెన్యూ 7.1 శాతం తగ్గినట్లు తెలిపింది. అలాగే విప్రో రెవెన్యూ 5.3 శాతం తగ్గింది. ఈ రెండు సంస్థలతో పోలిస్తే ఇన్ఫోసిస్ రెవెన్యూ కేవలం 2 శాతం మాత్రమే తగ్గింది. ప్రాఫిట్ విషయానికి వస్తే విప్రో 2.1 శాతం పెరుగుదల నమోదు చేయగా, టీసీఎస్ 13.5 శాతం తగ్గింది. అంటే టీసీఎస్, విప్రో కంటే మెరుగ్గా ఉండటంతో షేర్లు ఝూమ్మన్నాయి.
షేర్ టార్గెట్ అప్ గ్రేడ్
డొమెస్టిక్ బ్రోకరేజ్ ఎడెల్వెసిస్.. ఇన్ఫోసిస్ షేర్ టార్గెట్ ధరను రూ.950 నుండి రూ.1,050కి అప్ గ్రేడ్ చేసింది. మరో బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ టార్గెట్ ధరను రూ.1,050కి పెంచింది. కాగా, ఉద్యోగ ఆఫర్లు అందుకున్న 90 శాతం మంది ఇప్పటికే ఉద్యోగంలో చేరారని, మిగిలిన వారు ఈ క్వార్టర్లో చేరనున్నట్లు తెలిపిన ఇన్ఫీ, ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్స్కు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపింది.