ఇన్ఫోసిస్ అదుర్స్, 12 శాతం పెరిగిన లాభాలు: 50,000 ఉద్యోగాలు
దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ బుధవారం (ఏప్రిల్ 13) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఐటీ కంపెనీ నెట్ ప్రాఫిట్ ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరి రూ.5686 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదు చేసిన నెట్ ప్రాఫిట్ రూ.5,076 కోట్లు. రెండు రోజుల క్రితం అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ కూడా ఫలితాలను ప్రకటించింది. రెండు ఐటీ కంపెనీల ఫలితాలు కూడా మంచి వృద్ధిని నమోదు చేశాయి.
ఏడాది ప్రాతిపదికన తమ రెవెన్యూ 22.7 శాతం పెరిగి రూ.32,276 కోట్లకు చేరుకున్నదని, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.26,311 కోట్లుగా నమోదయిందని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇన్ఫోసిస్ ఆపరేటింగ్ మార్జిన్ అంతకుముందు డిసెంబర్ త్రైమాసికంలో 23.5 శాతంగా, గత ఏడాది ఇదే త్రైమాసికంలో (జనవరి-మార్చి) 24.5 శాతం నమోదు కాగా, సమీక్షా త్రైమాసికానికి 21.5 శాతానికి తగ్గింది.
డాలర్ టర్మ్స్లో రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 18.5 శాతం పెరిగి 4280 డాలర్లుగా నమోదయింది. షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుకు రూ.16 చొప్పున డివిడెండ్ చెల్లించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. నాలుగో త్రైమాసికంలో కొత్తగా 22వేల మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. దీంతో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 3,14,015కు చేరుకుంది. గత పూర్తి ఆర్థిక సంవత్సరానికి 85వేల మంది ఫ్రెషర్లను నియమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 50వేల మందిని నియమించుకోనున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా సైనిక చర్యతో ఉక్రెయిన్ పైన యుద్ధం నేపథ్యంలో రష్యాకు టెక్ దిగ్గజాలు షాకిస్తున్నాయి. రష్యా నుండి తమ కార్యకలాపాలు తరలిస్తున్నట్లు ఇన్ఫోసిస్ తాజాగా ప్రకటించింది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఒరాకిల్, ఎస్ఏపీ ఎస్ఈ వంటి దిగ్గజాలు షాకిచ్చాయి.