ఇన్ఫోసిస్ అదుర్స్, కొత్తగా 17000 ఉద్యోగాలు: భారీ ఒప్పందాలు
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. ఈ మూడో త్రైమాసికంలో కంపెనీ రూ.5,197 కోట్ల భారీ లాభాన్ని గడించింది. 2019-20 ఇదే త్రైమాసికం రూ.4,457 కోట్లతో పోలిస్తే 16.6 శాతం అధికం. ఇన్ఫీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12.3 శాతం ఎగబాకి రూ.25,927 కోట్లకు చేరుకుంది. గత ఏడాది రూ. 23,092 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం 12.3 శాతం వృద్ధి నమోదు చేసింది. కరోనాతో మొదటి రెండు క్వార్టర్లలో వృద్ధి ఉన్నప్పటికీ, అంతంతమాత్రంగానే ఉంది. కానీ ఈ త్రైమాసికంలో డబుల్ డిజిట్ గ్రోత్ సాధించింది.
ఆదాయ వృద్ధి అంచనాల సవరణ
ఈ ఏడాది ఆదాయ వృద్ధి అంచనాలను సవరించింది. గతంలో 2 శాతం నుండి 3 శాతం మధ్యలో ఉంటుందని అంచనా వేసిన ఈ టెక్ దిగ్గజం ఇప్పుడు దానిని 4 శాతం నుండి 5-శాతానికి సవరించింది. మార్జిన్ 24 శాతం నుండి 24.5 శాతానికి పెరగవచ్చునని భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోను రెండంకెల వృద్ధి సాధిస్తామని కంపెనీ తెలిపింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన సమీక్ష త్రైమాసికంలో ఆదాయ వృద్ధి 6.6 శాతంగా నమోదయింది. మూడో త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ మార్జిన్ 25.4 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 350 బేసిస్ పాయింట్ల వృద్ధి నమోదయింది.
ఒప్పందాలు
డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ 7.13 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందాలను కుదుర్చుకుంది. కంపెనీ మొత్తం ఆదాయంలో డిజిటల్ ఆదాయాల వాటా 50 శాతాన్ని దాటింది. ఫలితంగా 31.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఫ్రీ క్యాష్ ఫ్లో 19.4 శాతం పెరిగింది. దీంతో రూ.5,683 కోట్లకు చేరుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన కార్టర్ డిజిటల్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది.
పెద్ద ఎత్తున నియామకాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17000 మంది ఫ్రెషర్లను నియమించుకోనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 24000 క్యాంపస్ నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. డిసెంబర్ చివరి నాటికి ఉద్యోగుల సంఖ్య 2,49,312గా ఉంది. ఉద్యోగుల వలస రేటు 15.8 శాతం నుండి పది శాతానికి తగ్గింది. 97 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు.