Infosys Q1 Results: లాభం రూ.5,195 కోట్లు, కొత్తగా 35,000 ఉద్యోగాలు
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. ఈ ఏడాది 26,000 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇస్తామని గతంలో ప్రకటించింది. డిమాండ్కు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా 35,000 మందిని క్యాంపస్ ఎంపిక ద్వారా నియమించుకోనున్నట్లు బుధవారం త్రైమాసిక ఫలితాల సందర్భంగా తెలిపింది. 2020-21లో ఇన్ఫోసిస్ 21,000 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది.
డిజిటల్ నైపుణ్యాలకు డిమాండ్ భారీగా పెరుగుతోందని, అదే సమయంలో ఉద్యోగ వలస శాతం పెరుగుతున్న నేపథ్యంలో, భారీగా నియామకాలు చేపట్టనున్నట్లు ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్ రావు తెలిపారు. కంపెనీలో వలసల రేటు మార్చి త్రైమాసికంలో 10.9 శాతంగా నమోదయింది. జూన్ త్రైమాసికానికి ఇది 13.9 శాతానికి చేరుకుంది. జనవరి, జులైలో వేతన పెంపు ప్రకటించామని, పదోన్నతుల సంఖ్య పెరిగిందన్నారు.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం రూ.5,195 కోట్లకు చేరింది. 2020-21 ఇదే క్వార్టర్లో కంపెనీ లాభం రూ.4,233 కోట్లతో పోలిస్తే ఈసారి 22.7 శాతం వృద్ధి నమోదయింది. ఇదే సమయంలో ఆదాయాలు రూ.23,665 కోట్ల నుండి 17.8 శాతం పెరిగి రూ.27,896 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయంలో డిజిటల్ ఆదాయాలు 53.9 శాతం ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోసిస్ ఆదాయ అంచనాలను పెంచింది. అంతకుముందు అంచనా 12-14 శాతం కాగా, దానిని 14 శాతం నుండి 16 శాతానికి పెంచింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కాంట్రాక్ట్ వ్యాల్యూ 2.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఇన్ఫోసిస్లో మొత్తం ఉద్యోగులు 2.67 లక్షలు ఉన్నారు. జూన్ త్రైమాసికంలో సంస్థ నికరంగా 8000 మందిని నియమించుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,67,953కు చేరుకుంది. బ్రిలియంట్ బేసిక్స్ హోల్డింగ్స్, ఆ కంపెనీ అనుబంధ సంస్థ బ్రిలియన్ బేసిక్స్ లిమిటెడ్ను ఇన్ఫోసిస్లో విలీనం చేసుకోవడానికి బోర్డు అంగీకరించింది.