Infosys: అల్లుడి కోసం నారాయణమూర్తి త్యాగం.. విజయంపై గర్విస్తున్నానంటూ వెల్లడి..
Infosys: బ్రిటన్ తదుపరి ప్రధాని కాబోతున్న తన అల్లుడు రిషి సునక్ పట్ల గర్వంగా ఉందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అన్నారు. ఒక భారత మూలాలున్న హిందువు తొలిసారి ఈ ఘనతను సాధించాడు. 42 ఏళ్ల వయసులో రిషి సునక్ పిన్న వయస్సులో ప్రధానిగా గెలిచి సరికొత్త రికార్డు సృష్టించారు.
|
యూకే కోసం..
బ్రిటన్ అభివృద్ధికి పూర్తి స్థాయిలో రిషి సునక్ తన సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ.. Confident son-in-law అని నారాయణ మూర్తి అభినందించారు. రిషిని చూసి తాము గర్వపడుతున్నామని, యూకే ప్రజల కోసం అతను తనవంతు కృషి చేస్తాడనే నమ్మకం తనకు ఉందని నారాయణ మూర్తి తెలిపారు. పన్ను తగ్గింపు, మినీ బడ్జెట్ వంటి నిర్ణయాలతో నాటకీయంగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రిషి ఆ దేశానికి దిక్సూచిగా మారారు.
అక్షతతో వివాహం..
రిషి తల్లి ఉషా ఒక ఫార్మసిస్ట్, తండ్రి యష్వీర్ ఒక జనరల్ ఫిజీషియన్. ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న సునక్ గోల్డ్మన్ సాక్స్ గ్రూప్ లో మూడేళ్ల పాటు ఉద్యోగిగా పనిచేశారు. 2009లో ఆయన భారత ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, సుధామూర్తుల కుమార్తె అక్షతను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రష్యాలో ఇన్ఫోసిస్..
ఎన్నికల్లో భాగంగా రిషి సునక్, అతని భార్య అక్షత మూర్తి రష్యాలోని ఇన్ఫోసిస్ వ్యాపారం ద్వారా భారీగా లబ్ధి పొందారని ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు గుప్పించింది. అక్షత బ్రిటన్ ప్రభుత్వానికి భారీగా ఆదాయపు పన్ను ఎగవేసినట్లు ఆలోపించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రిషి, అక్షతలకు సహాయం చేసేందుకు ఇన్ఫోసిస్ యాజమాన్యం తన రష్యన్ వ్యాపారాన్ని పూర్తిగా మూసివేసింది. ఆ దేశం నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది.
వార్ తో బంధం బలం..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్, రష్యాల మధ్య వాణిజ్యం మరింతగా పెరిగింది. అదేవిధంగా యుద్ధం తర్వాత రష్యాను విడిచిపెట్టిన ఏకైక భారతీయ సంస్థ ఇన్ఫోసిస్. రిషి కోసం మామగారు నారాయణమూర్తి చేసిన సహాయం సామాన్యమైనది కాదు. అక్షతకు కూడా ఇన్ఫోసిస్ కంపెనీలో వాటాలు ఉండటం, డివిడెండ్ ఆదాయాన్ని పొందటం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ రిషి ప్రధానిగా ఎంపిక కావటంతో భారత్ లో ఇన్ఫోస్ షేర్లు లాభపడ్డాయి.