లాస్ ఏంజెల్స్: సాఫ్టువేర్ దిగ్గజం ఇన్ఫోసిస్కు మరో షాక్. అమెరికాలో మరో దావాను ఎదుర్కోనుంది. దీనిపై యూఎస్లో క్లాస్ యాక్షన్ లాసూట్ (దావా) దాఖలు కానుంది. లాస్ఏంజిల్స్కు చెందిన వాటాదారుల హక్కుల పరిరక్షణ సంస్థ ది స్కాల్ లా ఫర్మ్ ఈ లాసూట్ దాఖలు చేస్తోంది. స్వల్పకాలానికి ఆదాయ, లాభాలను పెంచి చూపేందుకు కంపెనీ తన ఆర్థిక నివేదికల్లో తప్పుడు లెక్కలు ప్రకటించిందని చెబుతోంది.

ఇన్వెస్టర్లు నష్టపోయారు.. రికవరీ కోసం..
కొద్ది రోజుల క్రితం ఇన్ఫోసిస్ పైన విజిల్ బ్లోయర్స్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆంశంపై ఇప్పటికే అమెరికా మార్కెట్ నియంత్రణాధికార సంస్థఎస్ఈసీ దర్యాఫ్తు చేస్తోంది. ఈ విచారణ కొనసాగుతుండగానే వీరి ఆరోపణల ఆధారంగానే ఈ సంస్థ తాజాగా కంపెనీపై దావాకు సిద్ధమైంది. ఇన్ఫోసిస్ పాటించిన అనైతిక ధోరణలు కారణంగా ఇన్వెస్టర్లు నష్టపోయినట్లు పేర్కొంది. వాటిని రికవరీ చేయడం కోసం అమెరికాకు చెందిన ఈ సంస్థ లాసూట్ దాఖలు చేస్తున్నట్లు తెలిపింది.

మమ్మల్ని సంప్రదించండి
అమెరికాలో ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లు పొందిన నష్టాలను రికవరీ చేయడం కోసం దావాను సిద్ధం చేసినట్లు గతంలో రోజెన్ లా ఫర్మ్ అప్పట్లో తెలిపింది. ఇప్పుడు స్కాల్ లా ఫర్మ్ సైతం దావా బాట పట్టింది. జూలై 7, 2018 నుంచి అక్టోబర్ 20, 20169 మధ్య ఇన్ఫోసిస్ షేర్లు కొన్న ఇన్వెస్టర్లు డిసెంబర్ 23, 2019లోగా తమను సంప్రదించవచ్చునని సూచించింది.

నిజాలు తెలిశాక ఇన్వెస్టర్లు నష్టపోయారు
సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్ఓ నీలాంజన్లపై విజిల్ బ్లోయర్స్ ఫిర్యాదులతో ఇప్పటికే ఇన్ఫోసిస్ పైన దెబ్బపడింది. ఇప్పుడు అమెరికా లా సంస్థ దావా అంశాన్ని వెల్లడించింది. మార్కెట్ను తప్పుదోవ పట్టించేలా ఇన్ఫోసిస్ తప్పుడు ప్రకటనలు చేసిందని ఈ లా సంస్థ ఆరోపించింది. స్వల్పకాలిక లాభాలను పెంచి చూపించడం కోసం ఆదాయాల లెక్కింపుకు తప్పుడు విధానాలు పాటించిందని ఫిర్యాదులో పేర్కొంది. పెద్ద డీల్స్పై ప్రామాణికంగా జరపాల్సిన సమీక్షలు జరగకుండా సీఈవో తప్పించారని ఆరోపించింది. పైగా ఈ అకౌంటింగ్ లొసుగులు, వివాదాస్పద డీల్స్ వివరాల్ని ఆడిటర్లు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల దృష్టికి తీసుకు వెళ్లనీయకుండా ఫైనాన్స్ విభాగంపై యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందని పేర్కొంది. ఈ అంశాలకు సంబంధించి కంపెనీ అందరినీ తప్పుదోవ పట్టించేలా అవాస్తవమైన, తప్పుడు ప్రకటనలు చేసింది. ఈ వ్యవహారం గురించి మార్కెట్లకు నిజాలు తెలిసిన అనంతరం ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని పేర్కొంది.

తగ్గిన షేర్
1,00,000 డాలర్లకు పైగా నష్టపోయిన ఇన్వెస్టర్లు తమ దావాలో భాగమయ్యేందుకు తమని సంప్రదించాలని ఈ లా సంస్థ తెలిపింది. డిసెంబర్ 23లోగా సంప్రదించాలని అందులో పేర్కొంది. దీనిపై ఇన్ఫోసిస్ స్పందించాల్సి ఉంది. దావా వార్తల నేపథ్యంలో స్పష్టత ఇవ్వాలని బీఎస్ఈ కోరింది. ఈ వార్తల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు గురువారం సుమారు 3 శాతం క్షీణించి, రూ.702 వద్ద క్లోజ్ అయింది.


Click it and Unblock the Notifications