infosys q4 2021: లాభాలు అదుర్స్, తుది డివిడెండ్ రూ.15
కరోనా సమయంలోను ఐటీ దిగ్గజాలు మంచి ఫలితాలను నమోదు చేస్తున్నాయి. ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో మంచి ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన Q4లో నికర లాభం ఏడాది ప్రాతిపదికన 17.5 శాతం పెరిగి రూ.5,076 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం రూ.4,321 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 13 శాతానికి పైగా ఎగిసి రూ.26,311 కోట్లకు చేరుకుంది. అంతకుముందు నాలుగో త్రైమాసికంలో రూ.23,267 కోట్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చు: ఎక్సైజ్ సుంకం తగ్గించే యోచన
ఆపరేటింగ్ మార్జిన్లు పెరిగాయి
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ నికర లాభం 16.6 శాతం వృద్ధితో రూ.19,351 కోట్లకు చేరుకుంది. ఆదాయం 10.7 శాతం పెరిగి రూ.1,00,472 కోట్లకు ఎగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో స్థిర కరెన్సీ ప్రాతిపదికన కంపెనీ 12 శాతం నుండి 14 శాతం ఆదాయ వృద్ధిని అంచనా వేస్తోంది. నిర్వహణ మార్జిన్ కూడా 22 శాతం నుండి 24 శాతంగా నమోదు కావొచ్చునని భావిస్తోంది. గత ఏడాది అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఆపరేటింగ్ మార్జిన్లు, నగదు నిల్వలు పెరిగినట్లు వెల్లడించింది.
షేర్ల బైబ్యాక్
ఒక్కో ఈక్విటీ షేర్ పైన కంపెనీ బోర్డ్ రూ.15 తుది డివిడెండ్ను సిఫార్స్ చేసింది. రూ.9,200 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు తెలిపింది. ఒక్కో షేర్కు గరిష్టంగా రూ.1,750 చొప్పున 5,25,71,428 షేర్లను చెల్లిస్తామని వెల్లడించింది. రూ.15,600 కోట్ల మూలధన ప్రతిఫలాన్ని ఇవ్వాలన్న కంపెనీ ప్రణాళికలో ఇది భాగం. గత ఏడాది డివిడెండ్ రూపంలో రూ.27 చెల్లించినట్లు అవుతుంది.
తుది డివిడెండ్ ఇచ్చేందుకు కేటాయించిన రూ.6400 కోట్లు ఇందులో భాగమే. స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా బహిరంగ మార్కెట్ విధానంలో కంపెనీ షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. మంగళవారం ముగింపు ధర రూ.1398తో పోలిస్తే బైబ్యాక్ షేర్ ధర రూ.25 శాతానికి పైగా ఎక్కువ. అంతకుముందు 2019లో రూ.8260 కోట్ల బైబ్యాక్ ఆఫర్ను, 2017 డిసెంబర్ నెలలో రూ.13000 కోట్ల బైబ్యాక్ను ఇచ్చింది.
కొత్త నియామకాలు
గత ఏడాది 36,500 మందిని ఇన్ఫోసిస్ కొత్తగా నియమించుకుంది. ఇందులో క్యాంపస్ నియామకాల ద్వారా 21,000 మందికి ఉపాధి కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 25,000 మంది ఫ్రెషర్స్ను తీసుకోనుంది. ఇందులో 1,000 మందిని విదేశీ క్యాంపస్ల ద్వారా నియమించుకోనుంది. Q3లో 10.1 శాతంగా నమోదైన ఉద్యోగ వలస రేటు Q4లో 15.2 శాతానికి పెరిగింది. మార్చికి ఉద్యోగుల సంఖ్య 2,59,619కు చేరుకుంది.