PM Kisan: పీఎం కిసాన్ డబ్బు వెనక్కివ్వాలంటూ ఆ రైతులకు నోటీసులు.. మీకూ ఇలా జరగొచ్చు.. ఎందుకంటే..
PM Kisan: మే 31, 2022న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడతలో భాగంగా 10 కోట్ల మంది రైతుల ఖాతాలకు ప్రధాని మోదీ నగదు బదిలీ చేశారు. ఇందులోభాగంగా ఈ రైతులందరి ఖాతాలకు రూ.2 వేలు జమ చేశారు. కానీ.. అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఇప్పుడు చాలా మంది రైతులకు ప్రభుత్వం రికవరీ నోటీసులు కూడా జారీ చేసింది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి అనర్హులుగా ఉన్న రైతులకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. వారి అకౌంట్లలో పడ్డ డబ్బును రికవరీ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారని ప్రముఖ వార్తా పత్రిక వెల్లడించింది.
యూపీ రైతుకు నోటీసులు:
వివరాల్లోకి వెళితే యూపీలోని సుల్తాన్పూర్ జిల్లాకు చెందిన ఒక రైతుకు ఈ విషయంలో నోటీసులు వచ్చాయి. సదరు రైతు పన్ను చెల్లింపుదారుడిగా గుర్తించినట్లు నోటీసుల్లో తెలిపారు. రైతును అనర్హుడని తెలిసి పథకంలో నమోదు చేయించుకున్నారన్నారు. అంటే.. ఆ రైతు అక్రమంగా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడని వారు అందులో వెల్లడించారు. పథకం కింద అందిన మొత్తం లబ్ధి సొమ్మును రైతు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని నోటీసులో స్పష్టం చేశారు. ఈ విషయాన్ని యూపీ అగ్రికల్చర్ డైరెక్టర్ వివేక్ సింగ్ ధృవీకరించారు. నివేదికల ప్రకారం.. కేవలం యూపీలోని ఖుషినగర్ జిల్లాలోనే దాదాపు 2800 మంది రైతులకు నోటీసులు జారీ చేయబడ్డాయి. వీరందరూ డబ్బును తిరిగి ఇవ్వవలసి ఉంది.
అసలు రూల్స్ ఏమిటంటే..
ఒక రైతు వ్యవసాయం చేసినా పొలం అతని పేరు మీద కాకుండా అతని తండ్రి లేదా తాత పేరు మీద ఉంటే.. అతనికి ఏడాదికి పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.6000 ప్రయోజనం ఉండదు. ఆ భూమి రైతు పేరు మీద ఉండాలి.
ఎవరికైనా వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ అందులో వ్యవసాయేతర కార్యకలాపాలు ఉంటే ప్రయోజనం ఉండదు. సాగుకు ఉపయోగపడని భూమి ఉన్నా ప్రయోజనం ఉండదు. ఒక రైతు మరో రైతు నుంచి భూమి తీసుకుని కౌలుకు వ్యవసాయం చేస్తే, ఆ కౌలుపై సాగు చేస్తున్న వ్యక్తికి కూడా పథకం ప్రయోజనం ఉండదు. అన్ని సంస్థాగత భూమి హోల్డర్లు ఈ పథకం కింద కవర్ చేయబడరు. ఎవరైనా రైతు లేదా అతని కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవిలో ఉన్నట్లయితే లేదా ఆ రైతు కుటుంబానికి ప్రయోజనం ఉండదు. రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, PSUలు/PSEలలో పదవీ విరమణ చేసిన లేదా సేవలందిస్తున్న ఉద్యోగులు, సేవలందిస్తున్న లేదా పదవీ విరమణ చేసిన అధికారులు, ప్రభుత్వ స్వయంప్రతిపత్త సంస్థల ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు పథకం ప్రయోజనాన్ని పొందలేరు. మాజీ లేదా పనిచేస్తున్న రాష్ట్ర మంత్రి/మంత్రి, మేయర్ లేదా జిల్లా పంచాయతీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభ మరియు రాజ్యసభ ఎంపీలు అర్హులు కారు. డాక్టర్లు, ఇంజనీర్లు, సీఏలు, ఆర్కిటెక్ట్లు, లాయర్లు వంటి నిపుణులు వ్యవసాయం చేసినా కూడా ఈ పథకం ప్రయోజనం పొందలేరు. 10,000 కంటే ఎక్కువ నెలవారీ పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ పెన్షనర్లకు ప్రయోజనం ఉండదు. ఒక రైతు లేదా అతని కుటుంబంలో ఎవరైనా గత అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించినట్లయితే, ఆ రైతు కుటుంబం కూడా పథకం పరిధి నుంచి మినహాయించబడుతుంది.
జాబితాలో పేరు ఉందోలేదో ఇలా తెలుసుకోండి..
PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు pmkisan.gov.in పోర్టల్లో తమ పేరు ఉందోలేదో చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఫార్మర్స్ కార్నర్ ఆప్షన్ పై క్లిక్ చేసి వారు తమ రాష్ట్రం, జిల్లా, గ్రామం అందించి గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు సమాచారం వస్తుంది. అర్హులైనప్పటికీ.. జాబితాలో మీ పేరు లేకుంటే, మీరు PM కిసాన్ సమ్మాన్ హెల్ప్లైన్ 011-24300606కు కాల్ చేయడం ద్వారా మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. PM కిసాన్ సమ్మాన్ యోజనలో ప్రభుత్వం 3 వాయిదాల్లో డబ్బును బదిలీ చేస్తుంది.
ఫిర్యాదు చేయవచ్చిలా..
రైతులు కూడా PM కిసాన్ హెల్ప్లైన్ నుంచి సమాచారం తీసుకోవచ్చు. ఏదైనా సమస్య ఉంటే ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. PM కిసాన్ హెల్ప్లైన్ నంబర్ 155261. ఇది కాకుండా.. PM కిసాన్ టోల్ ఫ్రీ నంబర్ 18001155266, PM కిసాన్ ల్యాండ్లైన్ నంబర్ 011-23381092, 23382401 కూడా అందుబాటులో ఉన్నాయి. PM కిసాన్ మరొక హెల్ప్లైన్ 0120-6025109. లేదా రైతులు pmekisan-mailid@ gov.inకు మెయిల్ చేయటం ద్వారా కూడా తమ ఫిర్యాదును చేయవచ్చు.