RBI new rules: టోకెనైజేషన్ గడువును ఆర్బీఐ పొడిగిస్తుందా?
క్రెడిట్/డెబిట్ కార్డ్స్ టోకెనైజేషన్ గడువు సమీపించింది. ఆర్బీఐ గత ఆదేశాల ప్రకారం జనవరి 1, 2022 నుండి ఇది అందుబాటులోకి వస్తుంది. అయితే దీనికి సంబంధించి గడువును పొడిగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)ని కోరుతున్నాయి బ్యాంకులు. ఆర్థిక వ్యవస్థలో ఏ మేరకు సన్నద్ధత నెలకొందనే అంశంపై బ్యాంకులతో ఆర్బీఐ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థను మొత్తాన్ని ఒకేసారి టోకెనైజేషన్ సిస్టం వైపు తీసుకెళ్లాలని భావించడం వల్ల ఆరంభంలో ఆన్లైన్ చెల్లింపులకు తీవ్ర అంతరాయాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయని బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కాస్త సమయం కావాలి
టోకెనైజేషన్కు సంబంధించి కొత్త నిబంధనలను పాటించేందుకు బ్యాంకింగ్ వ్యవస్థను సిద్ధం చేయాలని బ్యాంకులను ఆర్బీఐ కోరుతోంది. ఈ అంశానికి సంబంధించి బ్యాంకులు పూర్తి విశ్వాసంతో ఉన్నాయి. అయితే పేమెంట్ గేట్వే చిన్న సంస్థలు, వ్యాపారులు సంసిద్ధంగా లేరనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కొత్త ప్రక్రియకు మారడానికి చిన్న వ్యాపారులకు కాస్త సమయం అవసరమని బ్యాంకులు చెబుతున్నాయి.
అలాగే, కార్డ్ నెట్ వర్క్ సంస్థలు రూపే, వీసా, మాస్టర్ కార్డ్తో పాటు చెల్లింపు గేట్ వే పెద్ద సంస్థలు తాము టోకెనైజేషన్కు సిద్ధమని చెబుతున్నాయి. ఈ-కామర్స్ సైట్లు, ఫుడ్ డెలివరీ యాప్స్ టోకెనైజేషన్కు అనుమతి ఇవ్వమని కస్టమర్లకు సందేశాలు పంపిస్తున్నాయి. టోకెనైజేషన్ గడువును పొడిగించాలని బ్యాంకులు కోరుతున్నాయి. ఈ మేరకు ఐబీఏ.. ఆర్బీఐకి లేఖ కూడా రాసింది.
పొడిగించకుంటే భారం
ఒకేసారి టోకెనైజేషన్ను అమలు చేస్తే గందరగోళ పరిస్థితి తలెత్తవచ్చునని, దీనిని దశలవారీగా అమలు చేస్తేనే మంచిదని అంటున్నారు. ఆర్బీఐ కూడా గడువు పొడిగించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. గడువు పొడిగించకుంటే 20 శాతం నుండి 40 శాతం ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని అంటున్నాయి. ఇప్పటికి అయితే గడువు పొడిగింపుపై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.
ప్రస్తుతం ఇలా..
ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డులతో ట్రాన్సాక్షన్స్ నిర్వహించేటప్పుడు 16 అంకెల కార్డు నెంబర్, ఎక్స్పైరీ తేదీ, సీవీవి వంటి వివరాలు నమోదు చేయాలి. వీటికి అదనంగా మొబైల్కు వచ్చే ఓటీపీ జమ చేస్తే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. దీంతో కార్డు హోల్డర్స్ సున్నిత ఆర్థిక వివరాలు మర్చంట్ ప్లాట్ ఫామ్స్, పేమెంట్ గేట్వేలలో నిక్షిప్తమవుతున్నాయి. అన్ని ప్లాట్ ఫామ్స్ ఇదే విధానం అవలంభిస్తున్నాయి. వినియోగదారుల సున్నిత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు సేకరించి, మోసాలకు కారణమవుతుంది. ఇప్పుడు టోకెనైజేషన్ వల్ల ట్రాన్సాక్షన్ సులభమవుతుంది.