భారీగా పెరిగిన ఏటీఎఫ్ ధర, జీఎస్టీ పరిధిలోకి తేవాలని ఇండిగో
విమాన ఇంధన ధరలు భారీగా పెరిగాయి. గత కొద్ది నెలలుగా పెరుగుతూ వచ్చిన జెట్ ఫ్యూయల్ ధర ఆల్టైం హైకి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో దేశీయంగా జెట్ ఫ్యూయల్ ధరలను మరో 18 శాతం పెంచాయి చమురు విక్రయ సంస్థలు. 2022లో ఇప్పటివరకు ఆరుసార్లు పెరగడంతో కిలో లీటర్ ధర రూ.లక్షను దాటేసింది. ఏటీఎఫ్ చరిత్రలో ఇదే రికార్డ్. కిలో లీటర్ ధరను రూ.17,135.63 లేదా 18.3 శాతం పెంచడంతో కిలో లీటర్ ధర రూ.1,10, 666 ఉంది. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఇంధన విక్రయ సంస్థలు ధరలను సవరిస్తాయి.
విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం వాటా ఇంధనానిది. 2008 ఆగస్ట్ నెలలో అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 147 డాలర్లను తాకింది. అప్పుడు కిలో లీటర్ ఏటీఎఫ్ ధర 71,028గా ఉంది. రష్యా -ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ముడిచమురు బ్యారెల్ ధర 139 డాలర్లకు చేరినా, ఇప్పుడు తిరిగి 100 డాలర్లకు దిగి వచ్చింది. అయితే పదిహేనురోజులకు ఒకసారి సవరణ కారణంగా ఇక్కడ ధరలు పెరిగాయి. జనవరి 1 నుండి చూస్తే కిలో లీటర్ ఏటీఎఫ్ ధర 36,673.88 మేర అంటే యాభై శాతం పెరిగింది.
ఏటీఎఫ్ ధరలు పెరగడంతో విమానయాన సంస్థలు మరోసారి ఛార్జీలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు డాలర్ మారకంతో రూపాయి బలహీనపడగా, మరోవైపు ఇంధన ఛార్జీలు భారీగా పెరిగాయని, దీంతో టిక్కెట్ ఛార్జీలు పెంచవలసిన అవసరం ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా, ఏటీఎఫ్ ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న నేపథ్యంలో జెట్ ఫ్యూయల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని ఇండిగో సీఈవో రోనోజాయ్ దత్తా కోరుతున్నారు. డొమెస్టిక్ పాసింజర్ మార్కెట్లో ఇండిగో వాటా 55 శాతం వరకు ఉంది.