మళ్లీ పడిపోయింది: ఫిబ్రవరిలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ వినియోగం
భారతదేశంలో చమురు వినియోగం మళ్లీ పడిపోయింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి, ఏప్రిల్ నుండి పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కరోనా కేసులు తగ్గడం, రికవరీ పెరగడం, వ్యాక్సినేషన్ నేపథ్యంలో క్రమంగా చమురు వినియోగం పెరిగింది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఆందోళనకరంగా ఉండటం, వివిధ ప్రాంతాల్లో లాక్ డౌన్, ఆంక్షల కారణంగా మళ్లీ పడిపోయింది. సెప్టెంబర్ నెల నుండి క్రమంగా పెరుగుతూ వచ్చిన చమురు డిమాండ్, ఆ నెల తర్వాత తొలిసారి క్షీణించింది. సెప్టెంబర్ తర్వాత మొదటిసారి చమురు వినియోగం 5 శాతం పడిపోయింది.
ఉత్పత్తుల వినియోగం
పెట్రోలియం అండ్ నేచరల్ గ్యాస్ మినిస్ట్రీకి చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్(PPAC) ప్రకారం పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం ఫిబ్రవరి నెలలో 4.9 శాతం క్షీణించి 17.21 మిలియన్ టన్నులుగా నమోదయింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు గత నెలలో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో కొద్ది రోజులుగా ధరలు క్షీణించడంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు కూడా తగ్గించాయి.
పెరిగిన ఎల్పీజీ సేల్స్
దేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనం డీజిల్. ఈ డీజిల్ వినియోగం 8.5 శాతం క్షీణించి 6.55 మిలియన్ టన్నులకు పడిపోయింది. అదే సమయంలో పెట్రోల్ వినియోగం 6.5 శాతం తగ్గి 2.4 మిలియన్ టన్నులకు పడిపోయింది. రోడ్ల కోసం వినియోగించే నాప్తా సేల్స్ 11 శాతం తగ్గాయి. గత ఏడాది కరోనా సమయంలో పెరిగిన ఎల్పీజీ సేల్స్ ఇప్పుడు కూడా పెరిగాయి. కుకింగ్ గ్యాస్ ఎల్పీజీ సేల్స్ 7.6 శాతం పెరిగాయి.
చమురు వినియోగం అంచనా
2021లో భారత దేశంలో చమురు వినియోగం 13.6 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని క్రూడాయిల్ ఉత్పత్తి ఒపెక్ దేశాలు అంచనా వేశాయి. అంటే 2021లో 4.99 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఉంటుందని అంచనా వేశాయి. ఇదిలా ఉండగా, 2020లో భారత చమురు వినియోగం 10.54 శాతం తగ్గి 4.40 మిలియన్ డాలర్లు (bpd)కి పడిపోయింది. 2019లో ఇది 4.91 మిలియన్ డాలర్లుగా ఉంది.