ఆదాయం తగ్గింది.. ఇలా చేస్తాం: కొత్త సవాళ్లు స్వీకరించేందుకు యంగ్ ఇండియా రెడీ
కరోనా మహమ్మారి కారణంగా ప్రజల ఆదాయాలు పడిపోయాయి. అయినప్పటికీ భారతీయులు ఎక్కువమంది భవిష్యత్తుపై ధీమాగా ఉన్నారు. ఈ మేరకు యూకేకు చెందిన అంతర్జాతీయ సంస్థ స్టాండర్డ్ చార్టర్డ్ సర్వేలో యంగ్ ఇండియా కొత్త స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని, అలాగే ఇండియన్స్ భవిష్యత్తుపై ధీమాతో ఉన్నారని తేలింది. కరోనా ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆదాయంపై తీవ్రమైన ప్రబావం చూపుతోంది. భారతీయుల్లో 32 శాతం మంది తమ ఆదాయం కరోనా తర్వాత తగ్గినట్లు ఈ సర్వేలో వెల్లడించారు. తమ ఆదాయం, ఉద్యోగంపై మున్ముందుప్రభావం చూపనుందని సగానికి పైగా ఆందోళన వ్యక్తం చేశారు.
చైనా షావోమీకి ఇండియాలో దెబ్బ, టాప్ ప్లేస్లోకి శాంసంగ్!
యంగ్ ఇండియా ధీమా
ఇండియాతో పాటు పన్నెండు దేశాల్లో 12 వేల మందికి పైగా ఈ సర్వేలో పాల్గొన్నారు. భారత్, కెన్యా, చైనా, పాకిస్తాన్ తదితర దేశాల్లో సర్వే చేశారు. వ్యక్తుల ఆదాయ స్థితుగతులు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై సమాచారం సేకరించింది. వారి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తుపై ధీమాకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంది. అయితే మన దేశంలో యువత భవిష్యత్తుపై ఆశాభావంతో ఉన్నారు. మరింత కష్టపడటం, డిజిటల్ నైపుణ్యతను పెంచుకునేందుకు... ఇలా దేనికైనా సిద్ధమని చెబుతున్నారు. తద్వారా కొత్త ప్రపంచాన్ని స్వీకరిస్తామని చెబుతున్నారు.
డిజిటల్ నైపుణ్యాలున్నాయి
కరోనా తర్వాత అవసరమైన డిజిటల్ నైపుణ్యాలు కలిగి ఉన్నామని ప్రపంచవ్యాప్తంగా 75 శాతం మంది ధీమా వ్యక్తం చేయగా, ఇండియాలో 89 శాతం మంది ఉన్నారు. పద్దెనిమిదేళ్ల నుండి ముప్పై నాలుగేళ్ల మధ్య వయస్సు వారు పైవిధంగా విశ్వాసం వ్యక్తం చేశారు. 25 ఏళ్ల నుండి 34 ఏళ్ల మధ్య భారతీయుల్లో సెకండ్ ఇన్కంను ఎంచుకున్న వారు 76 శాతం మంది ఉన్నారు.
కొత్త వ్యాపారాలు ప్రారంభం
రానున్న ఆరు నెలల్లో కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే యోచనలో 18 నుండి 44 ఏళ్ల మధ్య వయస్కులు 56 శాతం మంది ఉన్నారు. 45 ఏళ్లకు పైబడిన వారు 45 శాతం మంది ఈ ఆలోచన చేస్తున్నారు. భారత్, చైనా, పాకిస్తాన్ ప్రజలు అదనపు ఆదాయం కోసం మరింత సమయం కేటాయిస్తామని 88 శాతం మంది చెప్పారు. ఇటీవలి కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్కు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. 83 శాతం మంది భారతీయులు (ప్రపంచంలో 71 శాతం) వారంలో కనీసం రెండు రోజులు ఇంటి నుండి పని చేసే సౌలభ్యం కోరుకుంటున్నారు.