India Debts: కొండలా పెరుగుతున్న భారత్ అప్పులు.. మీ నెత్తిన ఎంత అప్పు ఉందో తెలుసా..? మోదీ హయాంలో..
India Debts: భారత్ పై అప్పుల భారం మోదీ ప్రభుత్వ రాక తరువాత వేగం పుంజుకుంది. క్షణక్షణం అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం భారత ప్రభుత్వం నిమిషానికి సగటున రూ.2 కోట్ల అప్పుడు చేస్తోందనే వార్త షాక్ కి గురిచేస్తోంది. మార్చి 31, 2014 సమయానికి భారతదేశ అప్పులు దాదాపు రూ.55.87 లక్షల కోట్లుగా ఉన్నాయి. అయితే.. ఈ ఏడాది చివరి నాటికి ఇవి 152.17 లక్షల కోట్లకు చేరుకుంటాయని కేంద్రం పార్లమెంట్ లో ప్రకటించింది.
భారీగా అప్పులు..
గడచిన 65 సంవత్సరాలను ఒక్కసారి గమనించినట్లయితే.. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోని 9 ఏళ్లలో భారీగా అప్పులు పెరిగాయి. ఈ కాలంలో ఏకంగా రూ.96 లక్షల కోట్ల కొత్త అప్పుల భారం దేశ ప్రజలపై పడింది.
పెరిగిన తలసరి అప్పు..
2014 నాటికి భారత దేశం జనాభా దాదాపుగా 130 కోట్లుగా ఉంది. అప్పటి లెక్కల ప్రకారం తలసరి భారతీయుడిపై అప్పు రూ.4.30 లక్షల వరకు ఉంది. అయితే.. ప్రస్తుతం అంచనాల ప్రకారం దేశంలో జనాభా 140 కోట్లకు పెరిగింది. ఇక్కడ చిత్రమేంటంటే సగటు భారతీయుపై అప్పు దాదాపు మూడింతలు పెరిగి రూ.11 లక్షలకు చేరుకుంది. అంటే అప్పులు కొండలా పేరుకుపోతున్నాయి.
ప్రభుత్వానికి ఆదాయం..
ఆదాయం కోసం ఒక పక్క కేంద్ర ప్రభుత్వం డిస్ ఇన్వెస్ట్ మెంట్లు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, జీఎస్టీ పెంపు, టాక్సుల పెంపు, బంగారం.. పెట్రోల్ పై సుంకం వంటి అనేక చర్యలు తీసుకుంటోంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న సమయంలో ఇవి ప్రజలకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. అయితే ఈ అప్పులను క్రమంగా ప్రజల దగ్గరి నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వం వసూలు చేస్తుంది.
రిజర్వు బ్యాంక్ వెబ్ సైట్ వివరాలు..
2022 మార్చి చివరి నాటికి భారతదేశ బయటి రుణాలు రూ. 4.94 లక్షల కోట్లుగా ఉన్నాయని రిజర్వు బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ వివరాల ప్రకారం తెలుస్తోంది. 2021 మార్చి చివరి నాటితో పోల్చుకుంటే.. 47.1 బిలియన్ డాలర్లు పెరిగినట్లు వెల్లడించింది.