airports: సత్తా చాటిన భారత విమానాశ్రయాలు.. ప్రపంచ బెస్ట్ ఎయిర్ పోర్టుల్లో ఇండియాలోనివి ఇవే..
airports: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతుండటంతో వారిలో కొనుగోలు సామర్థ్యం పెరిగింది. విలాసాల కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదు. గతంలో విమాన ప్రయాణం కొందరు శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం మారిన పరిస్థితుల ప్రభావంతో వీధికొకరు విదేశీ ప్రయాణాలు చేస్తున్నారు. అందుకు తగినట్లుగా దేశీయ విమానాశ్రయాలు సైతం అభివృద్ధి చెందుతున్నాయి.
ఇతర సర్వేలకు భిన్నంగా..
ఈ ఏడాది ఎయిర్ పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ASQ) అవార్డులను 'ది ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) వరల్డ్' సోమవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ కస్టమర్ అనుభూతిని అందించిన ప్రముఖ విమానాశ్రయాలను ఇందులో విజేతలుగా ప్రకటించింది. ఇందులో పలు భారతీయ ఎయిర్ పోర్టులు ఉండటం గర్వకారణం. ఇతర సర్వేలకు భిన్నంగా.. ఎయిర్ పోర్టులో దిగిన ప్రయాణికుల స్పందన ఆధారంగా దీనిని రూపొందించినట్లు వెల్లడించింది.
ఇవీ దేశంలో బెస్ట్:
ఏడాదికి 40 మిలియన్లకు పైగా ప్రయాణీకుల కేటగిరీలో.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ, ముంబైలోనిఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉత్తమ ఎయిర్ పోర్టులుగా గుర్తింపు పొందాయి. 15 నుంచి 20 మిలియన్ల విభాగంలో హైదరాబాదులోని రాజీవ్ గాంధీ, 5-15 మిలియన్ల కేటగిరీలో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయాలు చోటు దక్కించుకున్నాయి. వీటికి తోడు పరిశుభ్రత విషయంలో ఢిల్లీకి చెందిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సత్తా చాటింది.
30 పైగా విభాగాల్లో అవార్డులు:
సులభంగా మార్గాన్ని కనుగొనడం, చెక్-ఇన్, షాపింగ్, డైనింగ్ ఆఫర్లువంటి ప్రయాణీకుల అనుభవాల్లోని 30 పైగా ముఖ్య అంశాలను పరిగణలోనికి తీసుకున్నట్లు ACI పేర్కొంది. విమానయాన అనుభవాన్ని ఏడాదికేడాది మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ఈ సర్వే ఫలితాలు ఉపయోగపడతాయని వెల్లడించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలను పరిశ్రమలోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.
కేటగిరీల వారీగా 75 విమానాశ్రయాలు:
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 75 విమానాశ్రయాలు 144 అవార్డులను గెలుచుకున్నట్లు ACI తెలిపింది. వివిధ కేటగిరీలుగా వీటిని విభజించినట్లు వెల్లడించింది. ప్రయాణీకుల పరిమాణం, ప్రాంతం, నైపుణ్యం కలిగిన సిబ్బంది, సులభతర విమానయానం, ఆహ్లాదం, పరిశుభ్రత వంటి విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరచిన వాటిని అవార్డులు వరించాయని వివరించింది. మొత్తం 4 లక్షల 65 వేల మంది ప్రయాణీకులపై ఈ సర్వే నిర్వహించినట్లు చెప్పింది.