2 దశాబ్దాల్లో టాప్ 3 ఆర్థికవ్యవస్థల్లో భారత్: ముఖేష్ అంబానీ ధీమా, జుకర్బర్గ్ ఏమన్నారంటే...
ముంబై: వచ్చే రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా అవతరించనుందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు కావొచ్చునని చెప్పారు. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్తో ఆన్లైన్ ముఖాముఖిలో మాట్లాడారు. ఫ్యూయల్ ఫర్ ఇండియా 2020 పేరుతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వర్చువల్ సమావేశం నిర్వహిస్తోంది. తొలి ఎడిషన్ నేడు ప్రారంభమైంది. ఈ వర్చువల్ భేటీలో మార్క్, అంబానీ మాట్లాడారు.
Arundhati Gold Scheme: ప్రభుత్వం 10 గ్రా. బంగారం ఫ్రీగా ఇచ్చే ఈ స్కీం తెలుసా?
టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లోకి..
రిలయన్స్ జియో ప్లాట్ఫాంలో ఫేస్బుక్ పెట్టుబడుల కారణంగా జియోకు లబ్ది చేకూరుతుందని ముఖేష్ అంబానీ అన్నారు. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్షపెట్టుబడిగా ఇది నిలిచిందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ.33,737 కోట్లతో జియోలో 7.7% వాటాను ఫేస్బుక్ దక్కించుకుందని చెప్పారు. దేశంలో జియో డిజిటల్ కనెక్టివిటీకి తెరతీసిందని, వాట్సాప్-నౌ ద్వారా వాట్సాప్ డిజిటల్ ఇంటర్-కనెక్టివిటీని కల్పిస్తోందని, రిటైల్ రంగంలో జియో మార్ట్ ఆన్లైన్, ఆఫ్లైన్లో అపార అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు.
గ్రామాలు, చిన్న పట్టణాలలోని దుకాణాలకూ డిజిటలైజేషన్ ద్వారా బిజినెస్ అవకాశాలకు మార్గం ఏర్పడుతోందన్నారు. డిజిటల్ సోసైటీగా మారుతున్న నేపథ్యంలో రానున్న 2 దశాబ్దాలలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని టాప్ 3లో ఒకటిగా ఆవిర్భవించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు.
తలసరి డబుల్ కంటే ఎక్కువ
యువశక్తి ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుందని, దీంతో తలసరి ఆదాయం ఇప్పుడున్న 1800 డాలర్ల నుండి 2,000 డాలర్ల నుంచి 5,000 డాలర్లకు పెరగవచ్చునని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. దేశంలో 50 శాతానికి పైగా మధ్యతరగతి కుటుంబాలే ఉన్నాయని, ప్రతి ఏటా వీరి ఆదాయం మూడు నుండి నాలుగు శాతం పెరుగుతుందని అంచనా వేశారు. పేస్బుక్తో పాటు ఎన్నో కంపెనీలు, వ్యాపారవేత్తలు భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కావడంతో పాటు రానున్న దశాబ్దాల్లో జరిగే సామాజిక మార్పులో పాలుపంచుకోవడం సువర్ణావకాశమని ముఖేష్ అంబానీ అన్నారు.
జుకర్బర్గ్ ఏమన్నారంటే
ఇండియాలో ప్రస్తావించదగ్గ ఎంటర్ప్రెన్యూర్షిప్ సంస్కృతి నెలకొందని మార్క్ జుకర్బర్గ్ అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ డిజిటల్ ఇండియా విజన్ కారణంగా ఎన్నో అవకాశాలు పుట్టుకు వచ్చాయన్నారు. ప్రభుత్వం తెచ్చిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ప్రజలకు మేలు చేస్తోందని, డిజిటల్ టూల్స్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఇంటర్నెట్ ప్రయోజనాలు ప్రజలకు అందడంలో జియో కీలకంగా మారిందన్నారు.