కరోనా పూర్వస్థితికి పెరిగిన పెట్రోల్ సేల్స్, అందుకే...
పెట్రోల్ సేల్స్ కరోనా మహమ్మారి ముందున్న స్థితికి చేరుకున్నాయి. డీజిల్ డిమాండ్ మాత్రం ఇంకా తక్కువగానే ఉంది. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో కార్యకలాపాలు క్షీణించి, అన్ని రంగాల్లో వినియోగం క్షీణించింది. పెట్రోల్, డీజిల్ వినియోగం కూడా భారీగా పడిపోయింది. ఆయితే ఆరు నెలల తర్వాత సేల్స్ పెరిగాయి. ఈ నెల ప్రథమార్థంలో పెట్రోల్ అమ్మకాలు 2019లో ఇదే కాలంతో పోలిస్తే 2.2 శాతం పెరిగాయి. గత నెలతో పోలిస్తే 7 శాతం పెరిగాయి.
ఏటీఎంకు వెళ్తున్నారా.. ఈరోజు నుండి మొబైల్ కచ్చితంగా వెంట తీసుకెళ్లండి!
సెప్టెంబర్ 1వ తేదీ నుండి 15వ తేదీ మధ్య 9,65,000 టన్నుల విక్రయాలు జరిగాయి. ఇండియా మూడు అతిపెద్ద రిటైలర్స్ పెట్రోల్ సేల్స్ సెప్టెంబర్ ప్రథమార్థంలో 2.2 శాతం పెరిగాయి. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన మన దేశంలో గ్యాసోలైన్ సేల్స్ పెరగడం స్వాగతించే పరిణామం. పెట్రోలియం ఉత్పత్తుల్లో ఎక్కువగా సేల్ అయ్యే డీజిల్ సేల్స్ మాత్రం ఆరు శాతం తగ్గాయి.
గత నెలతో చూస్తే డిమాండ్ 19.3 శాతం పుంజుకున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు వెల్లడించాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు 21.3 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. మహమ్మారి భయాలతో చాలామంది పబ్లిక్ ట్రాన్సుపోర్టుకు దూరంగా ఉంటూ, పర్సనల్ వెహికిల్స్ ఉపయోగిస్తున్నారని, అందుకే పెట్రోల్ వాడకం పెరిగిందని, డీజిల్ వాడకం తగ్గిందని చెబుతున్నారు. ఏడాది ప్రాతిపదికన జెట్ ఫ్యూయల్ సేల్స్ 60 శాతం క్షీణించాయి. ఎల్పీజీ గ్యాస్ సేల్స్ 12.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి.