దేశంలో HDFC ఆదిత్యకే భారీవేతనం, టాప్ బ్యాంకర్స్ శాలరీ.. ఎవరికెంత?
2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత బ్యాంకుల ఉన్నతాధికారుల్లో అత్యధిక వేతనం అందుకున్నది HDFC బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్యపురి. 25 ఏళ్లుగా ప్రయివేటు రంగంలో ఈ బ్యాంకుకు అధిక ఆస్తులు సమకూర్చడంలో ఇన్వెస్టర్ల నుండి అధిక వ్యాల్యూ లభించేలా చేస్తున్నారు ఈయన. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆయన సంపాదన 38 శాతం పెరిగింది. ప్రయివేటు రంగ బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ ముందుంది.
టీసీఎస్, యాక్సెంచర్ పోటీపడ్డప్పటికీ.. ఇన్ఫోసిస్ చరిత్రలో అతిపెద్ద, అరుదైన డీల్
భారీ వేతనం
హెచ్డీఎఫ్సీ సీఈవో ఆదిత్య పురి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.18.92 కోట్ల వేతనం తీసుకున్నారు. నెలకు రూ.1.5 కోట్లకు పైగా ఆయన వేతనం ఉంది. ఆయన ఈ ఏడాది అక్టోబర్ నెలలో తన 70వ ఏట బాధ్యతల నుండి తప్పుకుంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం టాప్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్కు వయో పరిమితి ఉంది. ఆదిత్యకు వేతనం కింద రూ.18.92 కోట్లు, స్టాక్స్ ఆప్షన్ కింద రూ,.161.56 కోట్లు లభించాయి.
ఆదిత్యపురి తర్వాత హయ్యెస్ట్ వేతనం..
ఆదిత్యపురికి 2018-19లో స్టాక్స్ ఆప్షన్ కింద రూ.42.20 కోట్లు, స్థూల వేతనం కింద రూ.13.65 కోట్లు వచ్చాయి. భారత బ్యాంకింగ్ చరిత్రలో ఇంత పెద్ద వేతనం ఎవరికీ లేదు. ఈయన తర్వాత ఈ గ్రూప్లో అత్యధిక వేతనం తీసుకున్న వారిలో గ్రూప్ అధిపతి శశిధర్ జగదీశన్ ఉన్నారు. ఈయనకు రూ.2.91 కోట్ల వేతనం లభించింది. ఆదిత్యపురి తర్వాత సీఈవో రేసులో శశిధర్ ఉన్నారు.
టాప్ బ్యాంకర్స్ వేతనం
అత్యధిక శాలరీ తీసుకునే ప్రయివేటు బ్యాంకు సీఈవోలలో ఈయన తర్వాత ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో సందీప్ బక్షి రూ.6.31 కోట్లు, యాక్సిస్ బ్యాంకు ఎండీ అమితాబ్ చౌదరి (రూ.6.01 కోట్లు, కొటక్ మహీంద్రా బ్యాంకు ఎండీ ఉదయ్ కొటక్ రూ.2.97 కోట్లు తీసుకుంటున్నారు. ఉదయ్ కొటక్ అంతకుముందు ఏడాది రూ.3.52 కోట్ల కంటే ఈసారి 18 శాతం తగ్గింది. సందీప్ బక్షి 2018-19లో రూ.4.90 కోట్ల వేతనం స్వీకరించారు.
రూ.50వేల కోట్ల సమీకరణ..
ఇదిలా ఉండగా, HDFC బ్యాంకు నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో 20% పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.5,568 కోట్లు కాగా, ఈసారి రూ.6,659 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.32,362 కోట్ల నుంచి రూ.34,453 కోట్లకు పెరిగింది. రుణనాణ్యత మెరుగుపడింది. స్థూల మొండి బకాయిలు 1.40% నుంచి 1.36% , నికర మొండి బకాయిలు 0.43% నుంచి 0.33% తగ్గినట్లు తెలిపింది. కేటాయింపులు రూ.2,614 కోట్ల నుంచి రూ.3,892 కోట్లకు పెరిగాయి. మరోవైపు, వ్యాపారవృద్ధి కోసం బాండ్స్ జారీ ద్వారా రూ.50,000 కోట్లు సమీకరించాలనే ప్రతిపాదనను వార్షిక సాధారణ సమావేశంలో షేర్ హోల్డర్స్ అంగీకరించినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు తెలిపింది. ప్రయివేటు ప్లేస్మెంట్ పద్ధతిలో ఈ బాండ్స్ జారీ చేస్తారు.