Digital Currency: భారత కొత్త డిజిటల్ కరెన్సీ ఎప్పుడు వస్తుందంటే?
భారత్ తన సొంత క్రిప్టో కరెన్సీని 2023 ఏడాది ప్రారంభంలో తీసుకు వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ప్రయివేటు క్రిప్టో కంపెనీల ఆధ్వర్యంలో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యాలెట్ తరహాలో ఇది కూడా పని చేస్తుంది. కానీ దీనికి ప్రభుత్వ హామీ ఉంటుందని స్పష్టం చేశాయి. రిజర్వ్ బ్యాంక్ మద్దతుతో డిజిటల్ రూపీని ప్రవేశపెట్టనున్నట్లు ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా తెలిపారు.
పేపర్ కరెన్సీ తరహాలోనే డిజిటల్ కరెన్సీకి ఆర్బీఐ ప్రత్యేక నెంబర్లను కేటాయిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చలామణిలోని నగదుతో పోలిస్తే డిజిటల్ కరెన్సీ భిన్నంగా ఏమీ ఉండదని, డిజిటల్ కరెన్సీని సాధారణ కరెన్సీకి డిజిటల్ రూపంగా భావించవచ్చునని చెబుతున్నాయి. ఓ రకంగా డిజిటల్ కరెన్సీ ప్రభుత్వ భరోసా ఉన్న ఒక ఎలక్ట్రానిక్ వ్యాలెట్ అన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి డిజిటల్ కరెన్సీ వినియోగానికి సిద్ధమవుతుందని చెబుతున్నారు. ఆర్బీఐ అభివృద్ధి చేస్తున్న డిజిటల్ రూపీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా చేతికి నోట్లకు బదులు ఫోన్లో డిజిటల్ కరెన్సీ ఉంటుంది. దానిని ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కోసమైనా వినియోగించవచ్చు. వీటికి ప్రభుత్వ హామ ఉంటుంది. పర్సుకు బదులు వ్యాలెట్లో డబ్బులు ఉంటాయి.