2019 కంటే 2020లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా జంప్: ఐదో స్థానంలో భారత్
గత ఏడాది(2020)లో భారత్లోకి 64 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) తరలి వచ్చాయని ఐక్య రాజ్య సమితి వెల్లడించింది. 2019లో 51 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు రాగా, 2020లో 64 బిలియన్ డాలర్లు వచ్చాయని తెలిపింది. ఇది మన కరెన్సీలో రూ.4.80 లక్షల కోట్లు. 2020లో అత్యధిక FDIలు అందుకున్న ప్రపంచ దేశాల్లో భారత్ 5వ స్థానంలో ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, కాబట్టి మధ్యకాలికంగా భారత్ పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోందని పేర్కొంది.
ఆశావాద దృక్పథం
ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలు మధ్యకాలికంగా దేశాన్ని ఆశావాదం దృక్పథంలో ఉంచుతున్నట్లు ఐక్యరాజ్యసమితి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ 2021 వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ నివేదిక పేర్కొంది. దేశ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ICT) పరిశ్రమ భారీ FDIలను ఆకర్షించినట్లు తెలిపింది. దేశం FDIల ఆకర్షణ దీర్ఘకాలిక ధోరణిగా ఉంటుందని పేర్కొంది. ప్రత్యేకించి ICT పరిశ్రమలో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేసింది.
పెట్టుబడుల పురోగతికి ఊతం
భారత్ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రస్తావిస్తూ, తయారీ, ఎగుమతి ఆధారిత పెట్టుబడుల పురోగతికి భారత ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ఊతమిస్తుందని అభిప్రాయపడింది. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ వంటి ప్రాధాన్యతా రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేసింది.
ప్రపంచవ్యాప్తంగా FDIలు
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా FDIలపై ప్రభావం చూపినట్లు తెలిపింది. 2019తో పోలిస్తే 2020లో ప్రపంచంలో FDIల వ్యాల్యూ 1.5 ట్రిలియన్ డాలర్ల నుండి 1 ట్రిలియన్ డాలర్లకు పడిపోయినట్లు పేర్కొంది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ పరిశ్రమలో FDIలు 22 శాతం పెరిగి 81 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దక్షిణాసియాలో FDIలు 20 శాతం వృద్ధితో 71 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపింది.