చైనా కంపెనీల పెట్టుబడులపై భారత్ మరో కీలక నిర్ణయం, ఎందుకంటే?
చైనా లక్ష్యంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులపై కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారత్ పొరుగు దేశాల్లోని కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది మోడీ ప్రభుత్వం. దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ కూడా ధీటుగా సమాధానం చెప్పింది. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నప్పుడు చైనాకు అనుకూలంగా మారకూడదని ఈ నిర్ణయం తీసుకుంది.
అదను చూసి HDFC షేర్లు కొనుగోలు చేసిన చైనా బ్యాంకు, ఇండియన్స్ ఆందోళన!!
చైనా పెట్టుబడులకు భారత్ బ్రేక్
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చైనా కంపెనీలు ఇప్పటికే విధించుకున్న పెట్టుబడి లక్ష్యాలకు ఈ నిర్ణయం బ్రేక్ వేసింది. దీంతో చైనా ప్రభుత్వంతో పాటు చైనీస్ ఇండస్ట్రీస్ వర్గాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో భారత్ తన నిర్ణయంలో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ ఆ కంపెనీలకు కాస్త ఊరట కలిగిస్తోంది.
చైనీస్ కంపెనీలకు కాస్త ఊరట
ముందే సిద్ధం చేసుకున్న ప్రణాళికలకు ఆటంకాలు ఎదురుకాకుండా ఉండేందుకు చైనా కంపెనీ ప్రతిపాదనల పరిశీలనను వేగవంతం చేయాలని మాత్రమే ప్రభుత్వం నిర్ణయించింది. వ్యూహాత్మక రంగాలు మినహా ఇతర అప్రధాన్య రంగాలకు సంబంధించి చైనా కంపెనీల పెట్టుబడుల ప్రతిపాదనలను 15 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అంటే కేవలం చైనాకే కాదు. భారత్ పొరుగుదేశాలన్నింటికి ఇది వర్తిస్తుంది. అయితే సక్రమంగా ఉన్న పెట్టుబడులను వేగవంతం మాత్రమే చేస్తారు. కానీ కేంద్రం అనుమతులు మాత్రం తప్పనిసరి. ఆ విషయంలో ఎలాంటి మార్పు లేదు.
అలీబాబా సహా వివిధ కంపెనీల ఆసక్తి
కరోనా సమయంలో అవకాశవాదుల పెట్టుబడులు లేకుండా కేంద్రం తీసుకున్న జాగ్రత్తల వల్ల ఇతర పెట్టుబడులపై ప్రభావం పడుతుందని, ప్రక్రియకు సమయం తీసుకుంటుందని కొన్ని చైనా సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. SAIC ఎంజీ మోటార్స్, గ్రేట్ వాల్తో పాటు అలీబాబా, టెన్సెంట్ వంటి పెద్ద పెద్ద సంస్థలు పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సున్నితరహిత రంగాల్లో పెట్టుబడులను 15 రోజుల్లో ఆమోదించేలా కేంద్రం ప్రయత్నిస్తోందని చెబుతున్నారు.
ఎక్కువ సున్నితమైనవి ఇవే..
ఇన్వెస్ట్మెంట్ ప్రపొజల్స్ను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తామని, కొన్ని రంగాలకు మాత్రం ఆలస్యం కావొచ్చునని సంబంధిత అధికారులు చెబుతున్నారట. దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఆటోమొబైల్స్, పునరుత్పాదక ఇంధనం కంటే టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సురెన్స్ వంటి విభాగాలను ఎక్కువ సున్నితమైనవిగా భావించే అవకాశముంది. ఆమోదానికి రెండు వారాల నుండి నాలుగు వారాలు పర్వాలేదని, కానీ క్లిష్టంగా ఉండవద్దని అంటున్నారు.