చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ కొత్త ప్లాన్.. బ్యాంకులకు, వ్యాపారులకు కీలక ఆదేశాలు..
China News: రష్యా దిగుమతులకు చెల్లించడానికి చైనా యువాన్ను ఉపయోగించకుండా ఉండమని బ్యాంకులు, వ్యాపారులను భారత్ కోరింది. రష్యా చమురుతో పాటు రాయితీ బొగ్గును కొనుగోలు చేసే అగ్రగామిగా అవతరించిన భారత్, ట్రేడ్ సెటిల్మెంట్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్లను ఉపయోగించాలని చూస్తున్నట్లు ముగ్గురు ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.
చైనాకు చెక్ పెట్టేందుకు..
రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే వరకు యువాన్లో సెటిల్మెంట్ను భారత్ అనుమతించదని ఒక అధికారి తెలిపారు. 2021 నుంచి వివాదాస్పద హిమాలయ సరిహద్దు వెంబడి వేలాది మంది భారతీయ, చైనా సైనికులు ప్రతిష్టంభనలో నిలిచిపోయారు. ఇది ఇరుదేశాల సంబంధాలపై నీలినీడలు అలుముతోందని తెలుస్తోంది. దీంతో విదేశీ వాణిజ్య చెల్లింపుల్లో యువాన్ సెటిల్మెంట్ను అంగీకరించడానికి భారత్ విముఖత చూపడం వెనుక ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయా లేదా అనేది ఐదుగురు అధికారులు వెల్లడించలేదు.
అల్ట్రాటెక్ సిమెంట్..
గత సంవత్సరం బిర్లాలకు చెందిన దేశంలోని అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారు అల్ట్రాటెక్ సిమెంట్ రష్యన్ బొగ్గు సరుకు కోసం చైనీస్ యువాన్ను ఉపయోగించింది. ఇది 2020లో లడఖ్లోని రిమోట్ గాల్వాన్ వ్యాలీలో ఘోరమైన సరిహద్దు ఘర్షణల తరువాత భారత్-చైనా మధ్య సంబంధాలు క్షీణించడంతో అధికారులలో కొంత ఆందోళనను లేవనెత్తింది. అల్ట్రాటెక్ ఒప్పందం తర్వాత ప్రభుత్వం.. సెంట్రల్ బ్యాంక్ అధికారులు, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్లతో పరిస్థితిని సమీక్షించింది.
రూబుల్ సెటిల్మెంట్..
ఇటీవలి వారాల్లో కొన్ని రష్యన్ చమురు కొనుగోళ్లను రూబుల్స్లో చెల్లింపులు చేయాలని కొన్ని కంపెనీలు నిర్ణయించాయి. ఈ భారతీయ రిఫైనర్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రష్యాలోని నోస్ట్రో రూబిళ్లు ఖాతా ద్వారా చెల్లింపులు కొంతవరకు ప్రాసెస్ చేయబడ్డాయి. అయితే రూబుల్ పాక్షికంగా మార్చుకోదగినది. దీనిపై పూర్తిస్థాయిలో రెండు దేశాలు ఇంకా ఫ్రేమ్వర్క్ను ఖరారు చేయనందున వాణిజ్యంలో ఎక్కువ భాగం ఇప్పటికీ ఇతర కరెన్సీల్లోనే జరుగుతోంది.