Budget 2022: భారత ఆర్థిక వ్యవస్థపై ఆర్థికవేత్త బసు కీలక వ్యాఖ్యలు
భారత్ మొత్తం స్థూల ఆర్థిక పరిస్థితి రికవరీ మోడ్లో ఉందని, కానీ తీవ్ర ప్రతిష్టంభనను లేదా స్టాగ్ఫ్లేషన్ ఎదుర్కొంటోందని వరల్డ్ బ్యాంకు మాజీ చీఫ్ ఎకనమిస్ట్ కౌషిక్ బసు అభిప్రాయపడ్డారు. కరోనా పరిస్థితుల్లో ప్రస్తుతం భారత వృద్ధి టాప్ ఎండ్లో కేంద్రీకృతమై ఉందని, ఇదీ ఆందోళనకరమన్నారు. గత నెలలో ద్రవ్యోల్భణం గణనీయంగా పెరిగిందని, దీంతో దేశం తీవ్ర ద్రవ్యోల్భణ ధోరణుల మధ్య ప్రతిష్టంభనను ఎదుర్కొంటుందన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. పరిస్థితి పరిష్కరించాల్సి ఉందన్నారు. కౌషిక్ బసు యూపీఏ హయాంలో ప్రభుత్వానికి ప్రధాన ఆర్థికసలహాదారుగా పని చేశారు. ప్రస్తుతం అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్భణం అధికంగా ఉండి ఆర్థిక వ్యవస్థలో ఎదుగులేని స్థితిని స్టాగ్ఫ్లేషన్ అంటారు.
రికవరీ మోడ్లో ఉంది కానీ....
ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్లోని దిగువ సగం మాంద్యంలో ఉందని, గత కొన్నేళ్లుగా దేశ విధానం పెద్ద వ్యాపారాలపై ఎక్కువగా దృష్టి సారించిందన్నారు. మొత్తానికి భారత స్థూల ఆర్థిక పరిస్థితి రికవరీ మోడ్లో ఉందని, అయితే ఈ వృద్ధి టాప్ ఎండ్లో కేంద్రీకృతమై ఉండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. అలాగే, దేశంలో యువత నిరుద్యోగిత రేటు 23 శాతానికి చేరుకుందని, అంతర్జాతీయంగా ఇదే గరిష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కరోనా ముందు కూడా ఎక్కువే ఉందన్నారు. వర్కర్లు, రైతులు, చిన్న వ్యాపారులు నెగిటివ్ గ్రోత్ ఎదుర్కొంటున్నారన్నారు.
జీడీపీ వృద్ధి అంచనాలపై...
2021-22 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలు 9.2 శాతంగా చెబుతున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.3 శాతం తర్వాత ఈ వృద్ధి కనిపిస్తోందని గుర్తు చేశారు. గత రెండేళ్లుగా సగటు వృద్ధి రేటు ఏడాదికి 0.6 శాతం మాత్రమే అన్నారు.నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్(NSO) జీడీపీ వృద్ధి రేటు అంచనా 9.2 శాతం, ఆర్బీఐ అంచనా 9.5 శాతంగా ఉంది. వరల్డ్ బ్యాంక్ వృద్ధి రేటు అంచనా 8.3 శాతం, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) 9.7 శాతంగా అంచనా వేస్తోంది.
ఆర్థికమంత్రిత్వ శాఖకు నైపుణ్యం
భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్రప్రతిష్టంభనను ఎదుర్కొంటోందని, ఇది బాధాకరమని, చాలా జాగ్రత్తగా క్యూరేటెడ్ పాలసీ జోక్యాలు అవసరమని, పదిహేనేళ్ల క్రితం ద్రవ్యోల్భణం పది శాతానికి దగ్గరగా ఉందని, కానీ ప్రస్తుత పరిస్థితితో ఒక తేడా ఉందన్నారు. ఆ సమయంలో భారత్ రియల్ జీడీపీ వృద్ధి 9 శాతంగా ఉందని, కాబట్టి ద్రవ్యోల్భణంతో పాటు సగటు కుటుంబ తలసరి 7 శాతం లేదా 8 శాతంగా ఉందన్నారు. కానీ ప్రస్తుతం రియల్ జీడీపీ 5 శాతానికి పడిపోయిందన్నారు.
ప్రస్తుత ప్రతిష్టంభన నేపథ్యంలో ఉద్యోగాలు సృష్టించడం, చిన్న వ్యాపారాలకు సహాయం అవసరమన్నారు. ఆహారపదార్థాల ధరలు పెరగడంతో డిసెంబర్ 2021లో రిటైల్ ద్రవ్యోల్భణం 5.59 శాతానికి పెరిగింది. ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా, భారత్ వృద్ధిని పట్టాలు ఎక్కించేందుకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖకు తగినంత నైపుణ్యం ఉందని, కానీ వాటిని వాస్తవరూపంలోకి తీసుకు రావడానికి రాజకీయంగా సాధ్యమో లేదో తనకు తెలియదన్నారు.