ఉద్యోగులకు గుడ్న్యూస్: చైనా కంటే భారత్ బెటర్, 2020లో శాలరీ 10% పెరుగుతుంది!
ఇటీవల ఆటో ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ సహా పలు రంగాల్లో తీవ్ర మందగమనం కనిపించింది. దీంతో చాలా ఉద్యోగాలు కోల్పోయాయి. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు ఉద్దీపన చర్యలు చేపట్టింది. దీంతో ఆటో సేల్స్ పుంజుకున్నాయి. ఇదిలా ఉండగా భారతీయ ఉద్యోగులకు ఓ శుభవార్త. వచ్చే ఏడాది ఇండియాలో ఇండస్ట్రీస్ ఉద్యోగుల వేతనాలు 10 శాతం పెరగనున్నాయని హ్యూమన్ రిసోర్సెస్ కన్సల్టెన్సీ కంపెనీ విల్లిస్ టవర్ వాట్సాన్ అంచనా వేసింది. ఇండియాలో కంపెనీలు ఆచితూచి అడుగు వేస్తున్నాయని, ఈ నేపథ్యంలో 2020లో నియామకాలు మందగిస్తాయని మరో చేదు వార్త చెప్పింది.
15 రోజుల్లో 126% పెరిగిన ఉల్లిధర, మరిన్ని రోజులు ఇదే పరిస్థితి
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇండియాలోనే ఎక్కువ
2019లో జీతాలు 9.9% పెరిగాయని, భారత్లో జీతాల పెరుగుదల 10% స్థిరపడిందని, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇదే అధిగమని తెలిపింది. ఇది ఇండోనేషియాలో 8%, చైనాలో 6.5%, ఫిలిప్పైన్స్లో 6%, హాంకాంగ్లో 4% మాత్రమేనని విల్లిస్ టవర్ వాట్సాన్ పేర్కొంది. వచ్చే ఏడాది ఇండియాలో వేతనాలు 10 శాతం పెరుగుతాయని ఈ నివేదిక తెలిపింది.
ఇతర దేశాల కంటే భారత్లోనే ఆశాజనకం
ఈ ఏడాది 9.9%గా ఉన్న వృద్ధి మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ వచ్చే ఏడాది మాత్రం పది శాతం తాకుతుందని విల్లిస్ టవర్ వాట్సాన్ తెలిపింది. ఆసియా పసిఫిక్ దేశాల్లో భారత్లోనే ఆశాజనక పరిస్థితులున్నాయని ఈ నివేదిక పేర్కొంది.
మధ్యశ్రేణి ఉద్యోగులకు ఎక్కువగా పెరిగే ఛాన్స్
ఆటోమేషన్, డిజిటలైజేషన్ మధ్య కూడా నైపుణ్యం కలిగిన ఉద్యోగుల్ని వదులుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేవని ఈ నివేదిక తెలిపింది. అయితే ఉన్నత ఉద్యోగులు, దిగువ శ్రేణి ఉద్యోగులతో పోలిస్తే మధ్యస్త ఉద్యోగులకు జీతాలు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇక ఈ అధ్యయనంలో పాల్గొన్న సంస్థల వ్యాపార వృద్ధి వచ్చే ఏడాది కాలంలో 28 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. అయితే 2018లో ఇది 37%గా ఉంది.
వేతన పెంపులో 25 శాతం వీరికే..
నివేదిక ప్రకారం.. ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులకు 9.6 శాతం నుంచి 10.1 శాతానికి, మధ్యస్థాయి మేనేజర్లు, వృత్తి నిపుణులు, సహాయక హోదాల్లో ఉండేవారికి 10.1 శాతం నుంచి 10.4 శాతం వరకు, ఉత్పాదక విధుల్లోని మానవ వనరులకు 10 శాతం నుంచి 10.3 శాతానికి పెరగనుంది. అయితే సామర్థ్యం ఆధారంగానే వేతన పెంపు ఉంటుందని ఈ నివేదిక తెలిపింది. వేతన పెంపు కోసం కేటాయించిన మొత్తంలో 25 శాతాన్ని అధిక సామర్థ్యం కనబరిచిన వారికి అందిస్తారు. దేశంలోని ఉద్యోగుల్లో వీరు 11.5 శాతంగా ఉంటారు.
నియామకాల్లో మందగమనం
ఉద్యోగుల వేతనాలు 2013లో 11 శాతం పెరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు ఆరేళ్ల తర్వాత 10 శాతాన్ని చేరుకోనుందని అంచనా వేసింది. అయితే నియామకాలు మందగిస్తాయని రిపోర్ట్ అంచనా వేసింది. 2018లో పలు కంపెనీల హెడ్ కౌంట్ 63 శాతంగా ఉండగా, 2019లో 70శాతానికి పెరిగింది. దీనిని అలాగే కొనసాగించాలని భావిస్తున్నాయి. 7 శాతం కంపెనీలు మాత్రం గత ఏడాది 8 శాతం హెడ్ కౌంట్తో పోలిస్తే తగ్గించాలని చూస్తున్నాయి.