COVID 19: ఆ దెబ్బతో బ్యాంకులకు రూ.లక్షల కోట్లు అవసరం
కరోనా మహమ్మారి నేపథ్యంలో మారటోరియం పొడిగింపు వల్ల బ్యాంకులకు వచ్చే రుణ చెల్లింపులు ఆలస్యం కానున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు లేకపోవడంతో ఎన్పీఏలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు పలువురు ఆర్థిక నిపుణులు ఎన్పీఏలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులకు రూ.1.5 ట్రిలియన్ (19.81 బిలియన్ డాలర్లు) ఇంజెక్ట్ చేయవలసి ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యమంత్రి గారూ! జోక్యం చేసుకోండి: తొలగింపు, వేతనాల కోతపై ఐటీ ఉద్యోగుల ఫిర్యాదు
ఎన్పీఏలు పెరగొచ్చు.. బ్యాంకులకు ఫండ్స్ అవసరం
ప్రభుత్వం తొలుత రూ.250 బిలియన్స్ మొత్తాన్ని బ్యాంకు రీక్యాపిటలైజేషన్కు పంప్ చేయాలని నిర్ణయించిందని, కానీ ఇప్పుడు ఇది గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా - లాక్ డౌన్ కారణంగా రుణ ఎగవేతలు పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నాయి బ్యాంకులు. బ్యాంకుల పరిస్థితి భయంకరంగా ఉండవచ్చునని, త్వరలో నిధులు అవసరం కావొచ్చునని చెబుతున్నారు. దీని గురించి ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
ఎన్పీఏలు 20 శాతానికి పెరగొచ్చు
భారతీయ బ్యాంకులు 2019 సెప్టెంబర్ నాటికి రూ.9.35 ట్రిలియన్ల నిరర్థక ఆస్తులను కలిగి ఉన్నాయి. ఇది వాటి మొత్తంలో 9.1 శాతం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి (వచ్చే మార్చి నాటికి) నిరర్థక ఆస్తులు 18 శాతం నుండి 20 శాతానికి పెరగవచ్చునని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రుణాల్లోని 20 శాతం నుండి 25 శాతం వరకు రిస్క్లో ఉన్నట్లు భావిస్తున్నారు.
రీక్యాపిటలైజేషన్ కోసం...
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మూడో నెలలోకి ప్రవేశించింది. మార్చి 24వ తేదీన ఇది ప్రారంభమైంది. దీంతో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిని, వృద్ధి రేటు భారీగా మందగిస్తుందని వివిధ రేటింగ్ ఏజెన్సీలు వెల్లడించాయి. ఆర్థిక పునరుద్ధరణకు సమయం పడుతుందని వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం పూర్తి నిధులు ఇంజెక్ట్ చేయలేదని, రీక్యాపిటలైజేషన్ కోసం బాండ్స్ జారీ చేయడం వంటి పరోక్ష చర్యలపై ఆధారపడవచ్చునని చెబుతున్నారు. గతంలోను ఈ పద్ధతి ఉపయోగించినట్లు చెబుతున్నారు.
రుణాల రేటు 6 శాతం నుండి 7 శాతం
ప్రభుత్వరంగ బ్యాంకుల కోసం కేంద్రం గత అయిదేళ్లలో రూ.3.5 ట్రిలియన్లను పంప్ చేసింది. సంక్షోభం కారణంగా కొత్త రుణాలు తగ్గాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా బ్యాంకులు రుణాల రేటును 6 శాతం నుండి 7 శాతం ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెబుతున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు బూస్టింగ్ అని చెబుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్యాపిటల్ మార్కెట్ నుండి మనీ నిధుల సమీకరణ అంత సులంభం కాదు. ప్రస్తుత మందగమన పరిస్థితుల్లో బ్యాంకులను నిలబెట్టేందుకు మూలధనం అవసరమంటున్నారు.