దారుణంగా దెబ్బతిన్నాం, ఇదిగో... భారత ఆర్థిక వ్యవస్థ V షేప్ రికవరీ
మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI), ఆటో సేల్స్, రైర్వే సరుకు రవాణా, స్టీల్ వినియోగం, పవర్ వినియోగం, ఈ-వే బిల్స్, హైవే టోల్, రిటైల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సూచీ సమూహాన్ని పరిశీలిస్తే భారత్ V షేప్ ఆకారంలో కోలుకుంటోందని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఇతర దేశాల కంటే ఎక్కువగా సంకోచించినట్లు నెలవారీ ఆర్థిక సమీక్ష నివేదికలో తెలిపింది. లాక్ డౌన్ కరోనా వ్యాప్తిని నిరోధించడానికి దోహదపడినట్లు తెలిపింది.
నిమిషంలో రూ.2 లక్షల కోట్లు హుష్కాకి, సెన్సెక్స్ క్రాష్.. కారణాలివే
ఎన్నో ప్రాణాలు కాపాడిన లాక్ డౌన్
అనివార్యమైన లాక్ డౌన్ కారణంగా మొదటి క్వార్టర్లో భారత జీడీపీ 23.9 శాతానికి క్షీణించినట్లు తెలిపింది. ఆక్స్ఫర్డ్ కోవిడ్ 19 గవర్నమెంట్ రెస్పాన్స్ ట్రాకర్ను ప్రస్తావిస్తూ, ఇది ప్రపంచంలోనే అత్యంత కఠినమైనదిగా పేర్కొంది. ఈ లాక్ డౌన్ కారణంగా ప్రపంచంలోనే మరణాల రేటు తక్కువగా ఉండేందుకు దోహదపడినట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. ఆగస్ట్ 31వ తేదీ నాటికి భారత మరణాల రేటు 1.78 శాతంగా ఉంటే, అమెరికా, యూకేలలో వరుసగా 3.04 శాతం, 12.35 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని తెలిపింది.
అందుకే V షేప్ రికవరీ
ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ దృక్పథం ఆశాజనకంగా ఉందని, జూన్ నుండి సూచీలు మెరుగు పడుతున్నాయని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ V షేప్లో కోలుకుంటున్నట్లుగా కనిపిస్తోందని తెలిపింది. లాక్ డౌన్ తర్వాత మొదటిసారి మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్(PMI) 52.2 వద్ద ఉందని, ఆగస్ట్లో ఆశాజన జోన్లో కనిపిస్తుందని అభిప్రాయపడింది. గత నెలలో ఈ-వే బిల్లులు 13.8 లక్షల కోట్లుగా ఉన్నాయని, తద్వారా గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 97.2 శాతానికి చేరుకుందని తెలిపింది.
సానుకూలత
ఆటో, ట్రాక్టర్, ఎరువుల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయని, రైల్వే రవాణా పెరిగిందని, స్టీల్, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరుగుతోందని తెలిపింది. జీఎస్టీ వసూళ్ల విషయంలో సానుకూలత కనిపిస్తోందని, రోజూవారీ టోల్ వసూళ్లు మెరుగుపడుతున్నాయని వెల్లడించింది. పెట్టుబడులు పెరుగుతున్నాయని, ఎగుమతుల్లో వృద్ధి కనిపిస్తోందని, వ్యవసాయ రంగంలో పురోగతి ఉందని తెలిపింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయని తెలిపింది. లిక్విడిటీ ప్రతికూలతలు లేకుండా కేంద్రం, ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.