ఉద్యోగులకు బ్యాడ్న్యూస్! వేతనాల పెంపు అంతంతే, వారికి మాత్రమే 15%
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఆయా కంపెనీలు ఉద్యోగులను తొలగించడం లేదా వేతనాల్లో కోత విధించడం జరిగింది. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు కోలుకుంటున్నాయి. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ మహమ్మారితో జాగ్రత్తగా సహజీవనం చేయడం అలవాటు చేసుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను కొన్ని కంపెనీలు వేతనాలు పెంచాయి. ఇందుకు సంబంధించి టీమ్లీజ్ 'జాబ్స్ అండ్ శాలరీస్ ప్రైమరీ రిపోర్ట్ 2020' పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది.
సింగపూర్.. బాధాకరమైన నిజం! ఆర్థికవ్యవస్థ దారుణంగా పతనం, రికవరీకి కూడా అవి బ్రేక్
వేతనాలు పెంచినా.. అంతంతే
టీమ్లీజ్ ప్రకారం... కరోనా ప్రభావం జీతాల పెంపుపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ఎన్నో సంస్థల ఆర్థిక పరిస్థితి క్షీణించింది. దీని నుండి బయటపడిన కొన్ని కంపెనీలు కూడా పెద్దగా జీతాలు పెంచే స్థితిలో లేవు. కొన్ని కంపెనీలు పెంచినప్పటికీ కనిష్టంగా 4.26% నుంచి గరిష్టంగా 11.22% మధ్య మాత్రమే పెంపు ఉండదని తెలిపింది. ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఈ సంవత్సరం వేతనాల పెంపు 15% మించి ఉండదని ఈ సంస్థ అంచనా వేసింది.
గత ఏడాది శాలరీ ఎంత పెరిగిందంటే..
అదే సమయంలో 2019లో కనిష్టంగా10.02 శాతం, గరిష్టంగా 11.11 శాతంగా ఉన్నట్లు తెలిపింది. టీమ్లీజ్ దేశవ్యాప్తంగా 9 నగరాల్లోని 17 రంగాల్లో గల 2,52,000 మంది ఉద్యోగుల శాలరీలను పరిశీలించి ఈ నివేదిక తయారు చేసింది. పెంచిన కంపెనీల విషయానికి వస్తే... 17 రంగాల్లోని 11 రంగాల్లో దాదాపు 10 శాతం కంటే తక్కువగానే వేతనాలు పెంచారు. ఇందులో ఆటోమొబైల్స్ అండ్ అలైడ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సురెన్స్, కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీడీ, ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అలైడ్, మీడియా అండ్ ఎంటర్టైన్మంట్, పవర్ అండ్ ఎనర్జీ, రిటైల్ అండ్ టెలి కమ్యూనికేషన్స్ ఉన్నాయి.
వేతనాల పెంపు స్వల్పం, స్థిరం లేదా ప్రతికూలత
కరోనా కారణంగా వేతనాల పెంపు స్వల్పంగా లేదా స్థిరంగా ఉండవచ్చునని టీమ్లీజ్ తెలిపింది. కొన్ని సంస్థల్లో ప్రతికూలంగా ఉండవచ్చునని పేర్కొంది. కేవలం సూపర్ స్పెషలైజ్డ్ ప్రొఫైల్స్ లేదా ప్రతిభావంతులకు మాత్రమే అవసరమైన మేరకు 15 శాతం పెంపు ఉండవచ్చునని తెలిపింది. ఎఫ్ఎంసీజీ, జీఎం టెక్నాలజీ (ఐటీ), ఈ కామర్స్,టెక్ స్టార్టప్స్, వేర్ హౌస్ వంటి వాటిల్లో 15 శాతం వరకు ఉన్నట్లు తెలిపింది.