Cement Imports: సామాన్యులకు ఇల్లు కట్టుకోవటం భారమేనా..? తొలిసారిగా ఆ దేశం నుంచి సిమెంట్ దిగుమతి..
Cement Imports: చరిత్రలో మొదటిసారిగా నేపాల్ నుండి భారతదేశానికి సిమెంట్ వచ్చింది. దీనిని చూస్తుంటే సామాన్యులకు ప్రస్తుత ద్రవ్యోల్బణ సమయంలో ఇల్లు కట్టుకోవటం మరింత ఖరీదుగా మారనుందా అనే అనుమానాలు వస్తున్నాయి. నేపాల్ తొలిసారిగా భారత్కు సిమెంట్ను ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా.. ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్న చెక్పోస్టు ద్వారా తొలివిడతలో 3,000 బస్తాల సరుకు భారత్కు చేరుకుంది.
నేపాల్లోని నవల్పరాసి జిల్లాలోని పాల్పా సిమెంట్ ఇండస్ట్రీస్ శుక్రవారం చరిత్రలో తొలిసారిగా సునౌలీ సరిహద్దు ద్వారా భారతదేశానికి మొదటి సిమెంట్ లోడ్ పంపింది. బడ్జెట్లో సిమెంట్ ఎగుమతులకు ప్రభుత్వం ఎనిమిది శాతం రాయితీ ఇవ్వడంతో నేపాల్ పారిశ్రామికవేత్తలు భారత్కు సిమెంట్ను ఎగుమతి చేసేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది.
నాణ్యత పరీక్షల తరువాత..
పుల్పా ఇండస్ట్రీస్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ జీవన్ నిరౌలా అందించిన వివరాల ప్రకారం.. నవల్పరాసి ప్లాంట్ రోజుకు 1,800 టన్నుల క్లింకర్, 3,000 టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. పుల్పా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బ్యానర్పై తాన్సెన్ బ్రాండ్ సిమెంట్ను ఉత్పత్తి చేసే పుల్పా, నాణ్యతా ప్రమాణాల తనిఖీలతో సహా అన్ని ప్రభుత్వ విధానాలను పూర్తయిన తర్వాత భారతదేశానికి సిమెంట్ను ఎగుమతి చేయడం ప్రారంభించింది.
మరిన్ని కంపెనీలు ముందుకు..
తాజా పరిణామంతో నేపాల్లోని మరో ఐదు సిమెంట్ కంపెనీలు తమ ఉత్పత్తులను భారత్కు ఎగుమతి చేసేందుకు సిద్ధమౌతున్నాయి. ఈ హిమాలయ దేశం 150 బిలియన్ నేపాల్ కరెన్సీ విలువైన సిమెంట్ను ఎగుమతి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని నేపాల్ సిమెంట్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వెల్లడించింది. నేపాల్ సిమెంట్ పరిశ్రమ దాని భారీ ఉత్పత్తి సామర్ధ్యం ఉన్నప్పటికీ.. స్థానికంగా మార్కెట్ డిమాండ్ లేకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కొంటోంది.
సిమెంట్ ధరలు తగ్గుతాయా..?
పుల్పా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారత్కు సిమెంట్ ఎగుమతుల వల్ల నేపాల్ ఉత్పత్తులు ప్రస్తుతం అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీ పడగలవని అన్నారు. ప్రభుత్వ గ్రాంట్తో పాటు భారతదేశానికి సిమెంట్ ఎగుమతి చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని నవల్పరాసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ కేశవ్ భండారీ అభిప్రాయపడ్డారు.
నేపాల్ నుంచి వస్తున్న సిమెంట్ కారణంగా దేశంలో కరోనా తరువాత పుంజుకుంటున్న రియల్టీ రంగానికి ఎంతగానో ఉపయోగం ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని కంపెనీలు వీరితో పోటీపడేందుకు తమ ధరలను తగ్గిస్తాయేమో వేచి చూడాల్సి ఉంది.