యూరప్పై భారత్ ఆధిపత్యం- సంక్షోభాన్ని అవకాశంగా
న్యూఢిల్లీ: భారత్.. అరుదైన ఘనతను ఆర్జించింది. యూరప్లో అగ్రరాజ్యంగా ఆవిర్భవించింది. యూరపియన్ యూనియన్లోని సభ్య దేశాలకు రిఫైన్డ్ ఫ్యూయెల్ను సరఫరా చేసే అతిపెద్ద దేశంగా నిలిచింది. అదే సమయంలో- రష్యా నుంచి క్రూడాయిల్ను రికార్డు స్థాయిలో కొనుగోలు చేసిన దేశంగా అగ్రస్థానానికి చేరుకుంది భారత్. ప్రముఖ అనలిటిక్స్ కంపెనీ కెప్లర్- ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఈ యుద్ధానికి బ్రేకులు పడట్లేదు. రెండు దేశాలు కూడా సై అంటే సై అంటోన్నాయి. రష్యా దాడిలో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని ప్రధాన నగరాలన్నీ ధ్వంసం అయ్యాయి. అయినా ఉక్రెయిన్ వెనక్కి తగ్గట్లేదు. అమెరికా, యూరోపియన్ యూనియన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సభ్య దేశాలు అందిస్తోన్న ఆయుధ సామాగ్రితో రష్యాను ఢీ కొడుతోంది.
ఉక్రెయిన్పై దండెత్తిన రష్యాను పాశ్చాత్య దేశాలన్నీ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఆ దేశంపై అన్ని రకాల నిషేధాలను జారీ చేశాయి. అనేక ఆంక్షలను విధించాయి. రష్యా నుంచి చమురు దిగుమతిని తగ్గించుకున్నాయి. ప్రత్యామ్నాయంగా రిఫైన్డ్ ఫ్యూయెల్ను భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోన్నాయి. ఈ సెగ్మెంట్లో భారత్ సరఫరా చేసే రిఫైన్డ్ ఫ్యూయెల్ మీద పూర్తిగా డిపెండ్ అయ్యాయి యూరప్ దేశాలన్నీ.
ఈ పరిణామాలు కాస్తా- భారత్ను అతిపెద్ద సరఫరాదారుగా నిలిపాయి. ప్రస్తుతం యూరప్ దేశాలకు రిఫైన్డ్ ఫ్యూయెల్ను సరఫరా చేసే దేశాల్లో భారత్ అగ్రస్థానాన్ని ఆక్రమించినట్లు కెప్లర్ వెల్లడించింది. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఇదివరకు రష్యా నుంచి క్రూడాయిల్ను దిగుమతి చేసుకునేవి. యుద్ధం ఆరంభమైన తరువాత రష్యా నుంచి ఆయిల్ను దిగుమతి చేసుకోవడాన్ని నియంత్రించాయి. అటు రష్యా కూడా బ్యారెల్ రేటును భారీగా పెంచింది.
దీనితో- ఇక ఆయా దేశాలన్నీ భారత్ మీద ఆధారపడ్దాయి. రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేస్తోన్న భారత్.. దాన్ని శుద్ధి చేసి యూరప్కు ఎగుమతి చేస్తోంది. ఫలితంగా- రష్యా నుంచి భారత్కు క్రూడాయిల్ దిగుమతులు భారీగా పెరిగాయి. ఈ నెలలో- ప్రతి రోజూ 3,60,000 బ్యారెళ్లకు పైగా క్రూడాయిల్ను భారత్ దిగుమతి చేసుకున్నట్లు కెప్లర్ తెలిపింది. ఈ దిగుమతుల్లో 44 శాతానికి పెరిగినట్లు అంచనా వేసింది.