కరోనా దెబ్బ: నరేంద్ర మోడీ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలేనా?
కరోనా వైరస్, లాక్ డౌన్ నేపథ్యంలో భారత వృద్ధి రేటు 4 శాతానికే పరిమితం కావొచ్చునని ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు (ADB) అంచనా వేసింది. స్థూల ఆర్థిక పరిస్థితుల అండదా వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2021-22) మాత్రం రికవరీకి పటిష్టంగా ఉండవచ్చునని, 6.2 శాతం వృద్ధి రేటు నమోదు కావొచ్చునని ఏడీబీ తెలిపింది. కరోనా, లాక్ డౌన్ కారణంగా ప్రజా జీవనంపై, వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం ఉందని పేర్కొంది.
ఇలా అభివృద్ధి
వ్యక్తిగత, కార్పోరేట్ పన్ను రేట్లకు సంబంధించి చేపట్టిన సంస్కరణల వల్ల వినియోగం, పెట్టుబడులు పెరుగుతాయని, బ్యాంకులకు అదనపు మూలధన సాయం, వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యల వల్ల గ్రామీణ ఆర్థికం మెరుగుపడుతుందని, ఇవి వృద్ధికి ఉపకరిస్తాయని ఏడీబీ తెలిపింది. ఇంధన ధరలు క్షీణించడానికి తోడు, డిమాండ్ తగ్గడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్భణం 3 శాతానికి పరిమితం కావొచ్చునని, 2021-22లో 3.8 శాతానికి చేరుకోవచ్చునని తెలిపింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 4.1 లక్షల డాలర్ల ప్రభావం
అమెరికా తదితర అగ్ర దేశాలు కరోనాతో విలవిల్లాడుతున్నాయని, ఈ వైరస్తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గరిష్ఠంగా 4.1 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.312 లక్షల కోట్లు) గండి పడవచ్చని ఏడీబీ తన అంచనాలో తెలిపింది. ఈ మొత్తం ప్రపంచ జీడీపీలో దాదాపు 5 శాతానికి సమానమని పేర్కొంది.
5 ట్రిలియన్ కోట్ల డాలర్ల మోడీ లక్ష్యం కలేనా?
గత ఆరు క్వార్టర్లుగా తగ్గుతూ వస్తోన్న భారత ఆర్థిక వృద్ధి, కరోనా దెబ్బకు మరింత దిగజారిందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 1991 తర్వాత అత్యంత కనిష్ఠస్థాయిని చవిచూడనుందని, ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు పెంచాలన్న కేంద్రం లక్ష్యం ఇదివరకే అసాధ్యమని భావించారని, ఇప్పుడు కరోనా కల్లోలం నేపథ్యంలో ఈ లక్ష్యాన్ని చేరుకోవడం దాదాపు కలే అని పేర్కొంది.
వివిధ రేటింగ్ ఏజెన్సీలు ఏం చెప్పాయి?
ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ గతంలోని 5.1 శాతం నుండి 2 శాతానికి తగ్గించింది. ఏడీబీ 4 శాతంగా అంచనా వేసింది. ఎస్ అండ్ పీ 5.2 శాతం నుండి 3.5 శాతానికి తగ్గించింది. ఇండియా రేటింగ్స్ 5.5 శాతం నుండి 3.6 శాతానికి తగ్గించింది.