FY21లో పుంజుకున్న డిమాండ్, అంతలోనే కరోనా సెకండ్ వేవ్ దెబ్బ
సుమారు నలభై సంవత్సరాల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రతికూలంగా నమోదయింది. కరోనా కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) జీడీపీ వృద్ధిరేటు మైనస్ 7.3 శాతంగా నమోదయింది. అయితే అంచనాల కంటే ఈ క్షీణత తక్కువగా ఉంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్కు ముందు అంటే జనవరి-మార్చి త్రైమాసికంలో వృద్ధి పుంజుకోవడంతో ఇది సాధ్యమైంది. జనవరి-మార్చిలో భారత్ 1.6% వృద్ధిని నమోదు చేసింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 0.5 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో జీడీపీ 3 శాతం వృద్ధి చెందింది. FY21 రెండో అర్ధ సంవత్సరంలో డిమాండ్ పుంజుకున్నట్లుగా డేటా చూపిస్తోంది.
మళ్లీ ఆ స్థాయికి చేరుకోవాలంటే
FY21 ప్రారంభం నుండే కరోనా తీవ్రత ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా మార్చి 25, 2020న లాక్డౌన్ విధించడంతో వినియోగం పడిపోయింది. ఆ తర్వాత దశలవారీగా ఆంక్షలు సడలించినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో 1979-80 తర్వాత పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ తొలిసారిగా క్షీణించింది. ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ 5.2 శాతం క్షీణించింది. 2019-20లో భారత్ 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. జాతీయ గణాంక కార్యాలయం డేటా ప్రకారం 2020-21లో భారత రియల్ జీడీపీ రూ.135 లక్షల కోట్లకు తగ్గింది. అంతకుుందు ఏడాది ఇది రూ.145 లక్షల కోట్లుగా ఉంది. మళ్లీ ఇక్కడకు చేరుకోవాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 10 శాతం నుండి 11 శాతం ఉండాలి.
అంచనాలకంటే...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెల నుండి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గత ఏడాది కంటే తక్కువ ప్రభావం ఉన్నప్పటి, ఈ ఏడాది రెండంకెల వృద్ధి సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. 2020-21లో ఆర్థిక వ్యవస్థ 8 శాతం కుంగుతుందని NSO, 7.5 శాతం తగ్గవచ్చునని ఆర్బీఐ అంచనా వేశాయి. 2016-17లో భారత వృద్ధి 8.3 శాతం, 207-18లో 7.0 శాతం, 2018-19లో 6.1 శాతం, 2019-20లో 4.0 శాతం నమోదు కాగా, 2020-21లో మైనస్ 7.3 శాతం నమోదయింది.
ద్రవ్యలోటు
అధిక పన్ను వసూళ్ల కారణంగా ద్రవ్యలోటు 2020-21లో జీడీపీలో 9.3 శాతానికి పరిమితమైంది. కరెన్సీ వ్యాల్యూలో రూ.18,21,461 కోట్లుగా ఉంది.
అంతకుముందు అంచనా 9.5 శాతం (రూ.18,48,655 కోట్లు). ఫిబ్రవరి 2020లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 3.5 శాతం(రూ.7.96 లక్షల కోట్లు)గా అంచనా వేశారు. కరోనా లేని 2019-20లోనూ ఆదాయవృద్ధి పెద్దగా లేకపోవడం వల్ల ద్రవ్యలోటు ఏడేళ్ల గరిష్టం 4.6 శాతానికి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22)లో ఇది 6.8 శాతంగా నమోదు కావొచ్చని అంచనా. ఏప్రిల్ 2021లో ద్రవ్యలోటు 5.2 శాతం (రూ.78,699 కోట్లు)గా ఉండొచ్చని అంచనా.