India to borrow: రికార్డు స్థాయిలో ఇండియా అప్పులు.. మోడీ పాలనలో ఎంత పెరిగాయంటే ?
India to borrow: మరో వారం రోజుల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా.. భారత ప్రభుత్వం ప్రాధాన్యతలు, కేటాయింపులపై రాయిటర్స్ సంస్థ పోల్ నిర్వహించింది. 43 మంది ఆర్థిక వేత్తలు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. ముఖ్యంగా రుణ సమీకరణ, తిరిగి చెల్లింపుల ప్రణాళికల గురించి చర్చించారు. మౌలిక సదుపాయాలు కల్పన, ఆర్థిక లోటు అధిగమించడంపై పలు సూచనలు చేశారు.
భారీగా రుణ భారం
రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో 16 లక్షల కోట్ల రూపాయల రుణం సమీకరించనున్నట్లు రాయిటర్స్ పోల్ వెల్లడించింది. 2014లో భాజపా అధికారంలోకి వచ్చినప్పుడు దేశ వార్షిక రుణాలు 5.92 లక్షల కోట్లు కాగా.. 2022-23 ఏడాదిలో 14.2 లక్షల కోట్లు అప్పు తెచ్చినట్లు గుర్చుచేసింది. కొవిడ్ సంక్షోభవం కారణంగా గత నాలుగేళ్లలో ప్రజా సంక్షేమానికి సర్కారు అధికంగా ఖర్చు చేసినట్లు పేర్కొంది. తద్వారా రుణభారం భారీగా పెరిగినట్లు తెలిపింది. రానున్న రోజుల్లో వృద్ధి మందగించడం, ఆర్థిక క్రమశిక్షణ చర్యల వల్ల రాబడి తగ్గనున్నట్లు అంచనా వేసింది.
సింహభాగం చెల్లింపులకే
పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోనుండటానికి ప్రధాన కారణం తిరిగి చెల్లింపుల భారమని ఆర్థికవేత్త ధీరజ్ నిమ్ పేర్కొన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను 4.4 లక్షల కోట్లు రీపేమెంట్ చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. 2023-24లో బడ్జెట్ లోటు జీడీపీలో 6 శాతానికి తగ్గుతుందని అభిప్రాయాలు వ్యక్తమైనా.. 2025-26 నాటికి 4.5 శాతానికి పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి మాత్రం చాలా దూరంలో ఉండనున్నట్లు చెబుతున్నారు.
క్రెడిట్ రేటింగ్ పై ప్రభావం
దేశ రుణభారం పెరుగుదలకు అడ్డుకట్ట వేసి, స్థిరంగా ఉంచుకునేందుకు ఇండియా మరింత మంచి ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇప్పటికే సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణభారం జీడీపీలో 83% శాతం ఉండగా.. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ కావడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయిలో భారత్ క్రెడిట్ రేటింగ్ మీద సైతం ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
సబ్సిడీల్లో కోత దిశగా..
రానున్న ఆర్థిక సంవత్సరం కేంద్రం మూలధన వ్యయం దాదాపు 9 లక్షల కోట్లకు చేరుతుందని పోల్ అభిప్రాయపడింది. అంటే జీడీపీలో సుమారు 3 శాతానికి సమానం. చైనాకు ధీటుగా ఎదగాలనే భారత్ కల నెరవేరాలంటే పెట్టుబడులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎక్కువగా వెచ్చించాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. తద్వారా ప్రభుత్వానికి నిధులు ఎక్కువగా అవసరం అవుతాయని అర్ధం. 2022-23 బడ్జెట్లో పేర్కొన్న 5 లక్షల కోట్లలో 25 శాతానికి ఆహారం, ఎరువులపై సబ్సిడీని తగ్గించడానికి కేంద్రం చూస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. తద్వారా దాదాపు 1.5 లక్షల కోట్లు మిగిలినట్లే.