Gold: బంగారాన్ని అమ్మేయాలా..? మాంద్యం ముంగిట సరైన నిర్ణయం ఇదే.. జాగ్రత్త..
Gold: ఒడిదొడుకులు 2022లో ఇన్వెస్టర్లకు దుఃఖాన్ని కలిగించాయి. ఇలాంటి తరుణంలో బంగారం సేఫ్ పెట్టుబడిగా పరిగణిస్తుంటారు. ఇదే సమయంలో బంగారం ధరలు గ్లోబల్ మార్కెట్లలో పడిపోవటం ఇన్వెస్టర్లను భయాందోళనకు గురిచేస్తోంది. ఇకపై పెట్టుబడులకు బంగారం స్వర్గధామం కాదా..? ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ పెట్టుబడులను అమ్మేయాలా..? అసలు పరిస్థితిపై ఇప్పుడు ఒకసారి లుక్కేయండి..
రెండు సార్లు అక్కరకు..
ఇటీవలి కాలంలో కరోనా మహమ్మారి సమయంలో, రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన సమయంలో బంగారం సురక్షితమైన పెట్టుబడిగా తనను తాను నిరూపించుకుంది. కొన్ని సార్లు బంగారం పెట్టుబడిదారుల సహనాన్ని పరీక్షించింది కూడా. ఈ అస్థిర ప్రవర్తన కారణంగా బంగారం ధరను అంచనా వేయడం కష్టతరం చేసింది. మరో పక్క డాలర్ బలాన్ని పుంజుకోవటంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి.
మాంద్యం భయాలు..
వడ్డీ రేట్లు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న సమయంలో గోల్డ్ ఎలాంటి వడ్డీ ఆదాయాన్ని ఇవ్వదు కాబట్టి ప్రస్తుతం దానిపై ఇన్వెస్టర్లు ఆసక్తిని చూపటం లేదు. దీనికి బదులుగు వారు డాలర్లలో పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోంది. మాంద్యం భయాల నేపథ్యంలో అనేక మంది తమ పెట్టుబడుల విషయంలో బంగారానికి ప్రథమస్థానం ఇవ్వటం లేదు. వడ్డీ రేట్లు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం వెంటనే తగ్గకపోవచ్చు. అందువల్ల ప్రస్తుతానికి మార్కెట్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంది. కొద్ది రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇన్వెస్టర్లు ఏమి చేయాలి..?
ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంటుందని, వడ్డీ రేట్లు పెరుగుతాయని మీరు ఆశించినట్లయితే.. మీ పోర్ట్ ఫోలియోలో ఈక్విటీ ఎక్స్పోజర్ను తగ్గించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దాదాపు ఏడాదిలో మెచ్యూర్ అయ్యే గోల్డ్, స్వల్పకాలిక బాండ్లకు డబ్బును కేటాయించుకోవాలని సూచిస్తున్నారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్, మీడియం-టర్మ్ ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయాలని ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ సిఫార్సు చేశారు.
కేవలం బంగారం మాత్రమే వద్దు..!
బంగారంలో పెట్టుబడులను పెట్టాలనుకునేవారు సావరిన్ గోల్డ్ బాండ్ మెచ్యూరిటీ వరకు ఉంచినట్లయితే పన్ను రహిత రాబడితో పాటు, అదనంగా 2.5 శాతం వడ్డీ ఆదాయం లభిస్తుంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పోర్ట్ ఫోలియోను వారి రిస్క్, రివార్డ్ ఆధారంగా వివిధ ఆస్తి తరగతుల్లో పెట్టుబడులను రీబ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం బంగారాన్ని మాత్రమే నమ్ముకోవటానికి ఇది సరైన సమయం కాదని నిపుణులు భావిస్తున్నారు.