27% తగ్గిన రూ.2,000 నోట్లు: మూడేళ్లలో 90 కోట్లకు పైగా నోట్లు వెనక్కి
ముంబై: 2016లో నోట్ల రద్దు తర్వాత తీసుకు వచ్చిన రూ.2000 నోట్ల చలామణి క్రమంగా తగ్గుతోంది. దాదాపు 27 శాతం రూ.2000 నోట్లు సర్క్యులేషన్లో లేవు. అంతేకాదు, ఆర్బీఐ కూడా ఈ పెద్ద నోట్లను ప్రింట్ చేయడం నిలిపివేసింది. అయితే కరోనా మహమ్మారి సమయంలో నగదు చలామణి మాత్రం పెరిగింది. ఈ మేరకు ఆర్బీఐ వార్షిక నివేదిక వెల్లడించింది. 90 కోట్లకు పైగా రూ.2000 నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. వీటి మొత్తం వ్యాల్యూ రూ.57,757కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది.
నోట్లు వెనక్కి
రూ.2000 నోట్లను క్రమంగా చలామణి నుండి వెనక్కి తీసుకోవడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గత రెండేళ్లుగా వీటి ప్రింటింగ్ను ఆపివేసింది. నోట్ల చలామణీని కూడా తగ్గిస్తూ వస్తోంది. 2018 మార్చి నాటికి 336.3 కోట్ల రూ.2వేల నోట్లు చలామణీలో ఉండగా, ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆ సంఖ్య 245.1 కోట్లకు పడిపోయింది. ఈ మేరకు ఆర్బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. వ్యాల్యూ పరంగా ఇది రూ.57,757 కోట్ల విలువైన 91.2 కోట్ల నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం ఏటీఎం నుండి గతంలో వచ్చినట్లు రూ.2000 నోట్లు రావడం లేదు.
రూ.2000 నోట్ల వ్యాల్యూ ఎంత తగ్గిందంటే
ఆర్థిక వ్యవస్థలో పెద్ద నోట్లపై ఆధారపడే అవసరాన్ని తగ్గించి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచాలనే ఉద్దేశంతో రూ.2000 నోట్లను తగ్గించాలని ఆర్బీఐ భావించింది. 2018 మార్చి నాటికి చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో వీటి పరిమాణం 3.27 శాతం. 2021 మార్చి నాటికి అది 2 శాతానికి క్షీణించింది. అలాగే మొత్తం కరెన్సీ వ్యాల్యూలో రూ.2000 నోట్ల వ్యాల్యూ 37 శాతం నుండి 17.78 శాతానికి తగ్గింది.
నగదు చలామణి పెరిగింది
కరోనా భయాలు, లాక్డౌన్ ఆంక్షలతో గత ఆర్థిక సంవత్సరంలో చలామణీలో ఉన్న నగదు పెరిగిందని ఆర్బీఐ తన వార్షిక నివేదికలో పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో చలామణిలో ఉన్న నగదు వ్యాల్యూపరంగా 16.8 శాతం, సంఖ్యాపరంగా 7.2 శాతం పెరిగింది. ప్రతి సంవత్సరం సగటు పెరుగుదలతో పోలిస్తే ఇది ఎక్కువ అని నివేదిక తెలిపింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి చలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల మొత్తం కరెన్సీ వ్యాల్యూలో రూ.500,రూ.2000 నోట్ల వాటా 85.7 శాతం.
కరోనా లాక్ డౌన్, ఆంక్షల నేపథ్యంలో నగదు వినియోగం పెరిగిందని, దీంతో బ్యాంకు నోట్లకు డిమాండ్ పెరిగినట్లు తెలిపింది. డిమాండ్కు అనుగుణంగా కొత్త నోట్ల సరఫరా కూడా చేపట్టామని, కరెన్సీ చెస్ట్ల్లో సరిపడా నిల్వలు ఉండేలా చూసుకున్నామని వెల్లడించింది.