లోన్ మారటోరియంపై పొడిగిస్తారా? నిర్మల ఏం చెప్పారంటే?
కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న సంస్థలకు రుణాల పునర్వ్యవస్థీకరణ, లోన్ మారటోరియం పొడిగింపుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)ని సంప్రదిస్తున్నామని, కలిసి కార్యాచరణ రూపొందిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. గత నెల ప్రారంభం వరకు లాక్ డౌన్ ఉంది. కరోనా సామాజిక దూరం, జనాలు బయటకు రాలేకపోవడం, ఖర్చులు తగ్గించుకోవడం వంటి వివిధ కారణాలతో సంస్థలు గాడిన పడేందుకు మరో మూడు నుండి ఆరు నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మారటోరియం పొడిగించాలని ఆయా రంగాలు కోరుతున్నాయి. ప్రధానంగా హాస్పిటాలిటీ రంగం నుండి ఈ డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మల స్పందించారు.
భారీగా తగ్గిన స్మార్ట్ఫోన్ సేల్స్: ఇండియాలో అడుగుపెట్టాక తొలిసారి ఈ చైనీస్ కంపెనీకి షాక్!
ఆతిథ్య రంగానికి మారటోరియంపై త్వరలో నిర్ణయం
కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పారిశ్రామిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు రుణాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని పరిశీలిస్తున్నామని నిర్మలా తెలిపారు. రుణాల పునర్వ్యవస్థీకరణ, మారటోరియానికి సంబంధించి ఇప్పటికే ఆర్బీఐతో ఆర్థికమంత్రిత్వ శాఖ పని సంప్రదింపులు జరుపుతోందని, ఈ అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. రుణ పునర్వ్యవస్థీకరణ అవసరమని సూత్రప్రాయంగా భావిస్తే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా కారణంగా అధికంగా నష్టపోయిన ఆతిథ్యరంగ సంస్థల రుణాలకు మారటోరియం పొడిగించాలా లేక ఆయా రుణాలకు పునర్వ్యవస్థీకరించాలా అనేది ఆర్బీఐతో కలిసి నిర్ణయిస్తామన్నారు. ప్రభుత్వ శాఖలతో పాటు సంబంధిత వర్గాలతో చర్చించాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిశీలించడంతో పాటు ప్రభుత్వంలోని వివిధ స్టేక్ హోల్డర్లతో విస్తృతంగా చర్చిస్తామన్నారు.
జీఎస్టీ తగ్గింపు కౌన్సిల్ నిర్ణయం
ఆరోగ్య సంరక్షణ, ఇతర ఉత్పత్తులపై జీఎస్టీ రేట్ల తగ్గింపు అనేది జీఎస్టీ మండలి తీసుకోవాల్సిన నిర్ణయమని నిర్మల చెప్పారు. దీనిని జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తుందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన హాస్పిటాలిటీ రంగం చేస్తున్న డిమాండ్లను తాను అర్ధం చేసుకోగలనన్నారు.
90 శాతం దెబ్బతిన్న ఆతిథ్య రంగం
కరోనా కారణంగా ఆతిథ్యరంగం 90 శాతం దెబ్బతిన్నదని, ఈ రంగంలో నాలుగున్నర కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారని హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (HAI) ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే లోన్ మారటోరియం పొడిగించవద్దని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ ఇటీవల ఆర్బీఐ గవర్నర్ను అర్జించారు. ఎస్బీఐ చైర్మన్ కూడా లోన్ మారటోరియం ఆగస్ట్ 31 తర్వాత పొడిగింపు అవసరం లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది.