pak debts: IMF ముందు బోర్లా పడిన పాకిస్థాన్.. బెయిలౌట్ బాటలో మరో ఎదురుదెబ్బ
pak debts: పొరుగు దేశం పాకిస్థాన్ పరిస్థితి మరింత దిగజారుతోంది. మిత్ర దేశాల నుంచి సహాయమూ పూర్తి స్థాయిలో అందడం లేదు. ప్రపంచ ఆర్థిక సంస్థల నిబంధనలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడానికి ప్రయత్నిస్తోంది. కానీ అవి సత్ఫలితాలను ఇవ్వడం లేదు. శ్రీలంక తరహాలోనే దివాళా తీయడానికి రెడీగా ఉందని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ సర్క్యులర్ డెట్ మేనేజ్మెంట్ ప్లాన్ (CDMP)ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తిరస్కరించడమూ అందుకు బలం చేకూరుస్తోంది.
అంచనాల నిండా అవాస్తవాలే:
ఓ ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ కథనం ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను విద్యుత్ టారిఫ్ ను 11-12.50 పాకిస్థానీ రూపాయల వరకు పెంచాలని IMF సమీక్ష మిషన్ సూచించింది. తద్వారా విద్యుత్ సబ్సిడీని 335 బిలియన్ డాలర్లకు పరిమితం చేయమని చెప్పింది. పాకిస్థాన్ సవరించి ఇచ్చిన CDMP వాస్తవానికి దూరంగా ఉందని సమీక్ష మిషన్ పేర్కొంది. అనేక తప్పుడు అంచనాలు సైతం ఉన్నట్లు గుర్తించింది. అందుకే విద్యుత్ రంగ నష్టాల నియంత్రణకు మార్పులు చేయాలని వెల్లడించింది.
సగానికి పైగా తగ్గించిన అంచనాలు:
గతంలో 1,526 బిలయన్ల కోసం పాక్ అంచనా వేయగా.. తాజా సవరణల్లో 952 బిలియన్లకు రుణాన్ని కుదించింది. 2023 మొదటి రెండు త్రైమాసికాల్లో యూనిట్ కు 7 రూపాయల చొప్పున, జూన్ నుంచి మూడవ త్రైమాసికంలో 1.64 చొప్పున విద్యుత్ టారిఫ్ ను పాక్ ప్రభుత్వం సర్దుబాటు చేసింది. తద్వారా 675 బిలియన్ల అదనపు సబ్సిడీ అవసరమని IMFకు నివేదించింది.
ఎలా లెక్కించారు..?
అయితే కొత్తగా సవరించిన CDMP ప్రాతిపదికను IMF వ్యతిరేకించింది. యూనిట్కు ₹ 11 నుండి ₹ 12.50 పరిధిలో టారిఫ్ను పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. తద్వారా 675 బిలియన్ల అదనపు సబ్సిడీ భారాన్ని సగానికి తగ్గించవచ్చని సూచించింది. తాజా సవరణలో ద్వారా డిస్కంల నష్టాలను సగటున 16.27 శాతానికి పరిమితం చేయొచ్చని పాక్ పేర్కొంది. ఈ మొత్తాలు ప్రభుత్వం ఎలా లెక్కించింది అనే విషయంపైనా IMF ప్రశ్నలు లేవనెత్తింది. ఇది తొమ్మిదో సమీక్ష కావడం గమనార్హం.