Gita Gopinath: భారత్కు అర్జంట్గా 100 కోట్ల డోసులు: మోడీ సర్కార్కు కీలక సూచనలు
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశంలో పెను విధ్వంసాన్ని సృష్టిస్తోంది. విషాదాన్ని మిగుల్చుతోంది. రోజూ నాలుగు వేలకు పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా మరణాల్లో అదే ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజువారీ పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టినప్పటికీ. మరణాల సంఖ్య మాత్రం ఆందోళనకరంగా ఉంటోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రోజువారీ బులెటిన్ ప్రకారం.. కరోనా మరణాలు మరోమారు నాలుగువేలకు పైగా నమోదయ్యాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 4,194 మంది కరోనా కాటుకు బలి అయ్యారు.
ఈ నెలలో పెట్రోల్, డీజిల్ రేట్ల మోత ఎలా ఉందో తెలుసా?: హిస్టరీలోనే ఫస్ట్టైమ్
కుంటుపడుతోన్న వ్యాక్సినేషన్..
ఈ మహమ్మారిని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ బృహత్ కార్యక్రమానికి టీకాల కొరత అడ్డుపడుతోంది. బ్రేకులు వేస్తోంది. మూడోదశ కింద 18 నుంచి 45 సంవత్సరాల్లోపు వయస్సున్న వారికి కూడా టీకాలను వేయాలని కేంద్రం ఆదేశించినప్పటికీ- అనేక రాష్ట్రాల్లో ఇది ఆరంభమే కాలేదు. కొన్ని చోట్ల అరకొరగనే కొనసాగుతోంది. టీకాల స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మూడోదశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తోన్నాయి.
ఐఎంఎఫ్ ఏం చెబుతోంది?
ఈ పరిస్థితుల్లో భారత్లో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) స్పందించింది. తొలిసారిగా పెదవి విప్పింది. భారత్లో వ్యాక్సినేషన్కు సంబంధించిన కీలక వివరాలను తన డిస్కషన్ నోట్ (IMF discussion note)లో పొందుపరిచింది. తన అంచనాలను ఇందులో స్పష్టం చేసింది. తన దేశంలో 60 శాతం జనాభాకు వ్యాక్సిన్ సరఫరా చేయాలంటే.. బారత్ ఒక బిలియన్ డోసుల టీకాలను ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసింది. ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్, భారత్కు చెందిన గీతా గోపీనాథ్ (Gita Gopinath), స్టాఫ్ ఎకనమిస్ట్ రుచిర్ అగర్వాల్ ఈ నోట్ను రూపొందించారు.
వ్యాక్సిన్ కొనుగోళ్లు సెంట్రలైజ్డ్
ఇప్పటికిప్పుడు భారత్ ఒక బిలియన్ డోసుల వ్యాక్సిన్లను ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం సెంట్రలైజ్డ్ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. కరోనా వైరస్ను ఎదుర్కొనడానికి ప్రపంచ జనాభాలో కనీసం 40 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇంకా చాలా సమయం పడుతుందని ఈ డిస్కషన్ నోట్ స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది తొలి ఆరు నెలల కాలం నాటికి ప్రపంచ జనాభాలో 40 శాతం మందికి వ్యాక్సిన్ చేయొచ్చని తెలిపింది. దీనికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందజేయాలంటూ వివిధ దేశాల నుంచి ఐఎంఎఫ్కు 50 బిలియన్ డాలర్ల విలువైన ప్రతిపాదనలు అందినట్లు వెల్లడించింది.
ఆర్థిక రంగం కుదుటపడాలంటే..
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికరంగం కుదుటపడాలంటే ఇంకో నాలుగేళ్ల సమయం పడుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పురోగమించడం ప్రారంభించినప్పటికీ.. 2025 నాటికి అది పూర్తిగా గాడిలో పడుతుందని తెలిపింది. దీనికోసం గ్లోబల్ ఎకానమీలో తొమ్మిది ట్రిలియన్ డాలర్ల మేర ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 34 లక్షల మందికి పైగా జనాభాను పొట్టనబెట్టుకున్న కరోనా వైరస్ పరిస్థితులు, దాని వల్ల ఏర్పడిన వైద్య సదుపాయాల కొరత మరో ఏడాది పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదని అంచనా వేసిందా డిస్కషన్ నోట్. ఆయా అంశాలన్నింటిపైనా చర్చించడానికి త్వరలోనే జీ 20 (G20), యూరోపియన్ కమిషన్ హెల్త్ సమ్మిట్ను ఏర్పాటు చేయనున్నట్లు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలియా జార్జెవా తెలిపారు.