హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్.. డౌన్: కొనేవారు లేక..!
హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్.. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత దాని ప్రభావానికి గురైనట్టే కనిపిస్తోంది. కొనుగోలుదారుల్లేక వేల సంఖ్యలో నివాసాలు ఖాళీగా ఉంటోన్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే.. ఈ సంవత్సరం ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య రెట్టింపు అయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల వల్ల విధించిన లాక్డౌన్ తరహా పరిస్థితుల వల్ల చాలామంది హైదరాబాద్ను ఖాళీ చేసి స్వస్థలాలకు తరలి వెళ్లడం.. వర్క్ ఫ్రమ్ హోమ్కు పరిమితం కావడం వంటి అంశాలు రియల్ ఎస్టేట్ బూమ్ తగ్గడానికి కారణాలయ్యాయి.
అదే సమయంలో ఇళ్ల ధరలు, భూముల రేట్లు భారీగా పెరగడం, ల్యాండ్ రేట్లను ప్రభుత్వం పెంచడం కూడా కొనుగోళ్లు తగ్గడానికి దారి తీశాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. నైట్ ఫ్రాంక్స్ రెసిడెన్షియల్ మార్కెట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2020 ప్రథమార్థంతో పోల్చుకుంటే.. అమ్ముడుపోని నివాసాల సంఖ్య రెట్టింపయింది. గత ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో 4,037 హౌసింగ్ యూనిట్లు అన్ సోల్డ్ కాగా.. ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఈ సంఖ్య రెట్టింపయింది. 11,918కి చేరింది. గత ఏడాది ప్రథమార్థంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం జనవరి-మే మధ్యకాలంలో హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ పురోగమించినప్పటికీ.. అమ్మకాలు తగ్గాయి.
అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ డైరెక్టర్ సీవీ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు నైట్ ఫ్రాంక్స్ రెసిడెన్షియల్ మార్కెట్ తెలిపింది. కొన్ని నెలలుగా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ క్రయ విక్రయాలు భారీగా తగ్గినట్లు సీవీ రెడ్డి పేర్కొన్నట్లు స్పష్టం చేసింది. ల్యాండ్ రేట్లను ప్రభుత్వం పెంచడం కొనుగోళ్లు తగ్గడానికి కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీని పెంచడం వంటి చర్యలను చేపట్టిందని చెప్పారు. 50 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలకు పైగా ధర పలికే యూనిట్లకు మాత్రమే కొంతమేర డిమాండ్ ఉందని, అది కూడా లోయర్ గ్రోత్ రేట్ను నమోదు చేస్తోందని అన్నారు.
వచ్చే సంవత్సర కాలంలో ఇళ్ల ధరలు 10 శాతానికి పైగా పెరుగుతాయంటూ నైట్ ఫ్రాంక్ రెసిడెన్షియల్ మార్కెట్ అంచనా వేసింది. 80 శాతం మంది గృహ యజమానులు ఈ దిశగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు పేర్కొంది. కొత్తగా ఇంటిని కొనుగోలు చేయడానికి 43 శాతం మంది ఆసక్తిగా ఉన్నారని, ప్రస్తుతం ఉంటోన్న ఇంటి కంటే మరింత విశాలమైన, విలాసవంతమైన గృహాన్ని కొనడానికి 22 శాతం మంది మొగ్గు చూపినట్లు తెలిపింది. విద్య, వైద్య సదుపాయాలున్న ప్రాంతాలను 91 శాతం మంది ఎంపిక చేసుకోగా.. పని చేసే ప్రదేశానికి దగ్గరగా ఉండాలని 78 శాతం మంది కోరుకున్నట్లు ఈ సర్వే తెలిపింది.