కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్లో అమ్ముడుపోని రూ 1,870 కోట్ల విలువైన గృహాలు!
ఇందుగలడందు లేడందు సందేహం వలదు ... అన్న పురాణ వాక్కు లా ఇప్పుడు కరోనా వైరస్ విస్తరించిపోయింది. ఒక్కో రంగాన్ని ప్రభావితం చేసుకుంటూ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంపై పడగవిప్పుతోంది. ఇప్పటికే రెండు నెలలుగా ఎలాంటి కార్యకలాపాలు లేక ఈ రంగం విలవిలలాడుతోంది. మరో రెండు నెలలు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ ఎత్తివేసినా... వెంటనే పరిస్థితిలు చక్కబడేలా కనిపించటం లేదు. పైగా ఉద్యోగులు, వ్యాపారులపై కరోనా వైరస్ ప్రభావం అధికంగా పడుతోంది. కొందరి జాబ్స్ పోతున్నాయి. మరికొందరికి జీతాల్లో కోతలు పడుతున్నాయి.
ఇక వ్యాపారులకు బిజినెస్ లేక దిగాలుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొన్నా... వెంటనే ఇండ్లు, ఫ్లాట్స్, ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తారా అన్నది పెద్ద ప్రశ్న. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ సహా రాష్ట్రమంతా రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చింది. మరీ ముఖ్యంగా గత మూడేళ్ళుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పట్ట పగ్గాలు లేకుండా వృద్ధి చెందుతూ వచ్చింది. ఒక సందర్భంలో హైదరాబాద్ లో కూడా ధరలు బెంగళూరు, ముంబై తరహాలో పెరగటం చూశాం. అయితే, ఇప్పుడు పరిస్థితిలు తలకిందులయ్యేలా కనిపిస్తున్నాయి.
రియల్ ఎస్టేట్ కుదేలు: హైదరాబాద్లోనే భారీగా పెరిగిన ధరలు, 39% సేల్స్ డౌన్
వాటి విలువు రూ 1,870 కోట్లు...
కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఇండియా మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ఈ సమయంలో హైదరాబాద్ లో సుమారు 2,400 కొత్త గృహాలు అమ్ముడు పోకుండా ఉండిపోయాయి. మొత్తం హైదరాబాద్ సప్లై లో వీటి వాటా 10% గా ఉంటుంది. అమ్ముడు పోని గృహాల విలువ సుమారు రూ 1,870 కోట్లు ఉంటుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనారోక్ వెల్లడించింది. ఈ మేరకు కంపెనీ ఒక నివేదిక రూపొందించింది. అయితే, మిగితా నగరాలతో పోల్చితే ఇప్పటికీ హైదరాబాద్ చాలా బెటర్ గా కనిపిస్తున్నా.. ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో అని రియల్ ఎస్టేట్ రంగంలోని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ కు ఉన్న కొన్ని ప్రత్యేకతల వల్ల ప్రభావం ఇతర నగరాలతో పోల్చితే కాస్త తక్కువగానే ఉండొచ్చని భావిస్తున్నారు.
అక్కడ మరీ దారుణం...
ఇండియాలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్ర లో రియల్ ఎస్టేట్ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. అనారోక్ నివేదిక ప్రకారం ముంబై లో 19,200 గృహాలు అమ్మకానికి దూరంగా ఉండిపోయాయి. వీటి విలువ ఏకంగా రూ 26,150 కోట్లు కావటం గమనార్హం. మహారాష్ట్రాలో మరో ముఖ్య నగరం ఐన పూణే లో కూడా పరిస్థితులు ఏమంత భిన్నంగా లేవు. ఈ నగరంలో 16,000 అమ్ముడు పోని యూనిట్లు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ 11,400 కోట్లు కావటం విశేషం. ఈ రెండు మహా నగరాల్లో మిగిలిపోయిన గృహాల విలువే సుమారు రూ 37,000 కోట్లు కావటం రియల్ ఎస్టేట్ రంగానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. పరిస్థితిలు సాధారణ స్థాయికి చేరుకొని మళ్ళీ ఇవన్నీ అమ్ముడుపోవాలంటే ఎంత సమయం పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
బెంగళూరుకూ తప్పని తిప్పలు
దక్షిణాదిలో రియల్ ఎస్టేట్ రంగానికి బెంగళూరు అతిపెద్ద మార్కెట్ గా అవతరించింది. ఐటీ రంగ రాజధానిగా ఆవిర్భవించటంతో ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇండ్ల కొనుగోళ్ల కు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ధరలు అధికంగా ఉన్నప్పటికీ... డిమాండ్ మాత్రం చెక్కు చెదరటం లేదు. కానీ, ప్రస్తుతం మాత్రం బెంగళూరు మహానగరంలోనూ రూ 7,150 కోట్ల విలువైన 10,100 యూనిట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. అక్కడ మొత్తం సప్లై లో వీటి వాటా 16% గా ఉంది. ఇక మరో ముఖ్య నగరం చెన్నై లో 9,400 యూనిట్ల గృహాలు రెడీ టూ మూవ్ కు సిద్ధంగా ఉన్నాయి. వీటి విలువ రూ 5,800 కోట్లుగా లెక్కించారు. సో, అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది నగరాలతో పోల్చితే హైదరాబాద్ నగరం కొంత బెటర్ అనే చెప్పొచ్చు.