Big C పండుగ ఆఫర్లు, రూ.12 కోట్ల గిఫ్ట్లు ఇవే!: ఫోన్ బుక్ చేస్తే 90 ని.ల్లో మీ చేతికి
హైదరాబాద్: మొబైల్ రిటైల్ చైన్ BIG C mobiles తన నెట్ వర్క్ను విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్పత్తుల విక్రయానికి కొత్తదార్లు వెతుకుతోంది. ఓ వైపు మందగమనం, మరోవైపు మొబైల్ హ్యాండ్ సెట్ మార్కెట్లో తీవ్రమైన పోటీ కారణంగా పోటాపోటీగా డిస్కౌంట్ సేల్స్ ఇస్తుండటంతో మార్జిన్ తగ్గుతున్న నేపథ్యంలో బిగ్ సీ కూడా ఈ-కామర్స్ బాట పట్టింది. తమ వ్యాపార పరిధిని విస్తరిస్తున్నట్లు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం బాలు చౌదరి తెలిపారు.
ITR మిస్ అయ్యారా? వారమే గడువు..
ఆన్లైన్లో బుక్ చేశాక గంటన్నరలో మీ చేతిలోకి ఫోన్
ఇందులో భాగంగా బిగ్ సీ మొబైల్స్ ఆన్లైన్లోకి ప్రవేశించింది. వెబ్ సైట్తో పాటు యాప్ ద్వారా మొబైల్ ఫోన్లను విక్రయిస్తుంది. ఫోన్ కొన్న కేవలం 90 నిమిషాల్లోనే కస్టమర్కు దానిని అందించనున్నట్లు బాలు తెలిపారు. ఆన్లైన్ మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా దాదాపు 20 శాతం అదనపు మార్కెట్ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
రూ.12 కోట్ల విలువైన బహుమతులు..
బిగ్ సీ 17వ వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్లకు రూ.12 కోట్ల విలువైన స్క్రాచ్ అండ్ విన్ బహుమతులు, రూ.5 కోట్ల నగదు రివార్డు పాయింట్లు అందించనున్నట్లు బాలు తెలిపారు. ఈ రివార్డు పాయింట్స్ను యాప్ ద్వారా ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. మొబైల్ విలువ ఆధారంగా పాయింట్లు లభిస్తాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రిటైల్ ఔట్ లెట్స్, ఆన్లైన్లో మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుపై రివార్డ్ పాయింట్స్ ఇస్తున్నామన్నారు. తద్వారా వీటిని భవిష్యత్తు కొనుగోళ్లలో తగ్గించుకోవచ్చునని చెప్పారు.
జనవరి చివరి దాకా ఆఫర్లు.. బహుమతులివే...
బిగ్ సి 17వ వార్షికోత్సవ ఆఫర్లు ఈ నెల 4వ తేదీన ప్రారంభమయ్యాయని, వచ్చే నెల (జనవరి) చివరన ముగుస్తుందని తెలిపారు. ఈ కాల వ్యవధిలో కంపెనీ రిటైల్ ఔట్ లెట్లలో కొనుగోలు చేసిన వారికి స్క్రాచ్ అండ్ విన్ ద్వారా ఫ్రిజ్లు, వాషింగ్ మిషన్స్, ఎల్ఈడీ టీవీలు, ల్యాప్టాప్స్, ఓవెన్లు గెలుచుకునే అవకాశముంది.
3వేలకు పెరగనున్న ఉద్యోగాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 200కు పైగా, తమిళనాడులో 21 స్టోర్స్ ఉన్నట్లు బాలు తెలిపారు. మార్చి 2020 నాటికి కర్ణాటకలో బిగ్ సి అడుగు పెడుతుందన్నారు. 2002లో చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ కంపెనీ అనతి కాలంలోనే అగ్రస్థాయికి చేరుకుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 2,000 చ.అ.ల్లో ఏర్పాటు చేసే స్టోర్స్లలో స్మార్ట్ టీవీలు, గాలి శుద్ధి యంత్రాలను విక్రయించనున్నట్లు చెప్పారు. మార్చి 2021 నాటికి మరో 75 స్టోర్లను తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ప్రారంభిస్తామన్నారు. దీంతో రిటైల్ ఔట్లెట్స్ సంఖ్య 225 నుంచి 300కి చేరుకోనుంది. ఇందుకు రూ.40 నుంచి రూ.50 కోట్ల నిధులు వెచ్చించనున్నారు. 2018-19లో రూ.1,000 కోట్ల ఆదాయాన్ని గడించిన ఈ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్లు అంచనా వేస్తోంది. వచ్చే ఏడాది రూ.1,500 కోట్లు ఉంటుందని భావిస్తోంది. ఈ కంపెనీలో 2,250 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. 2021 మార్చి నాటికి ఈ సంఖ్య 3వేలు దాటే అవకాశముంది.