వీసీ సర్కిల్ ను కొనుగోలు చేస్తున్న హిందూస్తాన్ టైమ్స్ గ్రూప్! డిజిటల్ మీడియా లో కన్సాలిడేషన్?
కొన్నేళ్లుగా డిజిటల్ మీడియా రంగానికి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరగటం, స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువైన తర్వాత... డిజిటల్ మీడియా, కంటెంట్ అందించే సంస్థలకు కలిసొచ్చింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేసిన తర్వాత ఇప్పుడు ఏకంగా డిజిటల్ మీడియా నే ప్రధాన మీడియా గా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా తో దెబ్బతిన్న కంపెనీలు యాడ్స్ నిలిపివేయడంతో ప్రింట్ మీడియా కు కష్ట కాలం మొదలైందని చెప్పాలి. అటు రీడర్స్ కూడా పేపర్లు చదివేకన్నా మొబైల్ ఆప్స్ లో వార్తలు చదివేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఇప్పుడు ప్రింట్ మీడియా కూడా ఒక సరికొత్త పరిణామ క్రమంలో ఉంది. దాదాపు అన్ని ప్రింట్ మీడియా సంస్థలు సొంతంగా డిజిటల్ విభాగాలను బలోపేతం చేయటంతో పాటు ఇప్పటికే డిజిటల్ రంగంలో స్థిర పడిన సంస్థలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో ఈ రంగంలో కన్సాలిడేషన్ మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు. రెవిన్యూ సంగతి ఎలా ఉన్నప్పటికీ ఆన్లైన్ పోర్టల్స్ కు మాత్రం పాఠకుల ఆదరణ అంతకంతకూ పెరిగిపోతోంది.
90 నిమిషాల్లో ఇంటికి నిత్యావసరాల డెలివరీ.. మినిమం డెలివరీ చార్జ్ రూ.29
హెచ్ టి మీడియా చేతికి వీసీ సర్కిల్...
హిందూస్తాన్ టైమ్స్, మింట్, హిందూస్తాన్ వంటి పత్రికలను ప్రచురించే ప్రముఖ మీడియా గ్రూప్ హెచ్ టి మీడియా లిమిటెడ్... తాజాగా వీసీ సర్కిల్ అనే ప్రముఖ వెబ్ పోర్టల్ సంస్థను కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు కంపెనీ బీఎస్ఈ కి సమాచారాన్ని వెల్లడించింది. వీసీ సర్కిల్ ను ప్రచురించే మొజాయిక్ మీడియా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ను కొనుగోలు చేసేందుకు హెచ్ టి మీడియా డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా న్యూస్ కార్ప్ అనే మాతృ సంస్థ నుంచి మొజాయిక్ మీడియా సంస్థ ను హెచ్ టి మీడియా కొనుగోలు చేస్తుంది. ఈ లావాదేవీ మొత్తం నగదు రూపంలో జరగనున్నట్లు హెచ్ టి మీడియా వెల్లడించింది. ఇందుకోసం వర్కింగ్ కాపిటల్ సర్దుబాట్ల అనంతరం రూ 6 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు బోర్డు అనుమతించింది. అలాగే మరో రూ 1 కోటి కూడా రెవిన్యూ మైలురాళ్ళు అధిగమించిన ప్రాతిపదికన చెల్లించేలా నిర్ణయానికి వచ్చింది. దీంతో మొజాయిక్ మీడియా లో 100% షేర్ల ను హెచ్ టి మీడియా సొంతం చేసుకుంటుంది.
రూ 14.5 కోట్ల ఆదాయం...
మొజాయిక్ మీడియా ... వీసీ సర్కిల్ తో పాటు టెక్ సర్కిల్ అనే ఆన్లైన్ పోర్టల్స్ ను నిర్వహిస్తోంది. వీటితో పాటు ఈవెంట్స్ నిర్వహణ కూడా చేపడుతోంది. అలాగే కస్టమ్ రీసెర్చ్ విభాగంలో కూడా నిమగ్నమై ఉంది. కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరానికి మొజాయిక్ మీడియా రూ 14.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంత క్రితం ఏడాది ఈ కంపెనీ రూ 14 కోట్ల ఆదాయాన్ని గడించింది. వీసీ సర్కిల్, టెక్ సర్కిల్ సంస్థలు దేశంలో స్టార్టుప్ కంపెనీలకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ తో పాటు డీల్స్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తూ కొద్ది సమయంలోనే మంచి ఆదరణ పొందాయి. దీంతో స్టార్టుప్ సర్కిల్స్ లో వీటికి యమా క్రేజ్ ఏర్పడింది. సాధారణంగా మీడియా సంస్థలు నష్టాల్లో ఉంటాయి. కానీ.. ఈ కంపెనీ మాత్రం లాభాలు ఆర్జించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఐతే కరోనా వైరస్ వ్యాప్తి అన్ని వ్యాపారల్లాగానే ఇది కూడా ప్రభావితం అయినట్లు సమాచారం.
అందుకేనా కొనుగోలు...
ఇదిలా ఉండగా... న్యూస్ కార్ప్ అనే విదేశి పబ్లిషింగ్ కంపెనీ మొజాయిక్ మీడియా ను 2015 లో కొనుగోలు చేసింది. అప్పట్లో డిజిటల్ మీడియా సంస్థల్లో విదేశీ సంస్థలు 100% పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం దానిని ప్రింట్ మీడియా తో సమానంగా 26% వరకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుమతి ఇస్తుండటంతో ఈ లావాదేవీ జరిగిందా అన్న అంశం కూడా చర్చకు వచ్చింది. కాగా, న్యూస్ కార్ప్ అనే సంస్థ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాల్ స్ట్రీట్ జర్నల్, ది టైం మ్యాగజిన్ లను ప్రచురిస్తుంది. ఈ అంశాలు ఎలా ఉన్నా... ప్రస్తుతం ఇండియాలో మాత్రం డిజిటల్ మీడియా సంస్థలకు డిమాండ్ పెరుగుతోందని స్పష్టమవుతోంది. ఈ రంగంలో నిలదొక్కుకుంటే భవిష్యత్ బంగారమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే వీసీ సర్కిల్ వంటి మరిన్ని కొనుగోళ్లు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.