కరోనా లాక్డౌన్: స్టార్టప్ల గుండెల్లో రైళ్లు!
కరోనా వైరస్ విజృంభణ, లాక్డౌన్.. అంకుర సంస్థల(స్టార్టప్ కంపెనీలు) గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఏదో సాధించాలని, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి, కెరీర్ను సైతం ఫణంగా పెట్టి అంకుర సంస్థలు ఏర్పాటు చేసుకున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పరిస్థితి ప్రస్తుతం కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.
పరిస్థితులు ఇలాగే మరికొంతకాలం కొనసాగినా, ప్రభుత్వాలు లాక్డౌన్ను కొనసాగించినా.. ఇప్పటికే అంతంతమాత్రంగా నడుస్తోన్న అంకుర సంస్థల పరిస్థితి మరింత దిగజారవచ్చు. కొన్ని స్టార్టప్లు మూతపడవచ్చు.. మరొకొన్ని స్టార్టప్ల మనుగడే ప్రశ్నార్థకం కావచ్చు.
దేశంలో 28,979 స్టార్టప్ కంపెనీలు...
ఒకప్పుడు దేశంలో స్టార్టప్లకు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. కానీ ప్రస్తుతం స్టార్టప్ల సృష్టిలో అమెరికా, చైనా తరువాత మూడో స్థానంలో మన దేశం ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి మన దేశంలో స్టార్టప్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ వస్తోంది. దీంతో వీటిని ఏర్పాటు చేసే వారు కూడా ముందుకొస్తున్నారు. ఈ ఏడాది మార్చి 1 నాటికి మన దేశంలో స్టార్టప్ కంపెనీల సంఖ్య 28,979 కాగా.. వీటిలో దాదాపు 3,37,335 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీటిలో 20కిపైగా ‘యూనికార్న్'(ఒక బిలియన్ డాలర్ల విలువైన సంస్థలు)లు ఉన్నాయి.
రెక్కాడితేగాని డొక్కాడని స్టార్టప్లు ఎన్నో...
ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం చూపిస్తూ.. దాని మీదే తమ వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనతో అనేక స్టార్టప్ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలతో పోల్చితే.. స్టార్టప్ల పనితీరు భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఒక స్టార్టప్ కంపెనీలో సగటున 10-12 మందికి మించి ఉద్యోగులు ఉండరు. ఒక కొత్త సాంకేతికతపైన లేదా ఒక సేవ, ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకురావడంపై వీరంతా పని చేస్తుంటారు. అందరూ కలిసి ఒక కటుంబంలా పని చేస్తే తప్ప లక్ష్యాన్ని చేరుకోలేరు. చాలా స్టార్టప్లు ఏ నెలకు ఆ నెల ఆదాయాన్ని ఆర్జిస్తూ నెట్టుకొస్తుంటాయి. ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభంతో చాలా స్టార్టప్ కంపెనీల ఆదాయం పడిపోయింది. దీంతో ఏం చేయాలో, ఉద్యోగులకు ఎలా వేతనాలు ఇవ్వాలో తెలియని పరిస్థితి.
నిలిచిపోయిన పెట్టుబడులు...
కరోనా వైరస్ సంక్షోభంతా అంతర్జాతీయంగా పరిణామాలు మారిన నేపథ్యంలో సార్టప్ కంపెనీల్లోకి వచ్చే పెట్టుబడులు ఆగిపోయాయి. ఇప్పటికే చర్చలు పూర్తయి, ఇక పెట్టుబడులు రావడమే ఆలస్యం అని ఆశించిన కంపెనీలకు ప్రస్తుత పరిస్థితి పెద్ద షాక్. ఉన్న నిధులతో రెండు, మూడు నెలలు అయితే నెట్టుకురావచ్చేమోగానీ.. చాలా స్టార్టప్ కంపెనీలది ఇలా ఎక్కువ కాలం మనుగడ సాగించలేని దుస్థితి. పెట్టుబడి పెట్టే వారేమో కాస్త ఆగండి.. కరోనా నుంచి బయట పడ్డాక చూద్దాం అంటున్నారు. దేశంలో అనేక సమస్యల పరిష్కారం, సాంకేతికత అభివృద్ధి, ఉద్యోగాల కల్పన తదితర విషయాల్లో స్టార్టప్ కంపెనీలు కొంత వరకు తోడ్పడుతున్నా.. ప్రస్తుత సంక్షోభంతో చాలా కంపెనీలు డైలమాలో పడిపోయాయి.
ఈ పరిస్థితులు ఇంకెంతకాలం?
కరోనా వైరస్ సంక్షోభం చాలా స్టార్టప్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలు కంపెనీల ఆదాయం గణనీయంగా తగ్గిపోగా, కొన్ని కంపెనీల్లో అయితే ఆదాయం పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితులు ఇంకెంతకాలం కొనసాగుతాయో అన్న ఆందోళన స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకుల్లో కనిపిస్తోంది. ఫిన్టెక్ వ్యాపార విభాగంలో కంపెనీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పీ2పీ విధానంలో ఇప్పటికే అప్పులు ఇచ్చిన ఈ కంపెనీలు వాటి వసూలు విషయమై తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు కొత్త రుణాలు ఇచ్చే దాతలు లేరు. కమీషన్ పద్ధతిలో పని చేసే సంస్థల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారైంది. కనీసం కార్యాలయాల అద్దె, ఇతర ఖర్చులకు అవసరమయ్యే డబ్బును ఎక్కడ్నించి సమకూర్చుకోవాలన్నది వీరికి పెద్ద ప్రశ్నలా మారింది.
డేటా సంరక్షణ సంగతేంటి?
పెద్ద కంపెనీల్లో డేటా సంరక్షణకు సర్వర్లు ఉంటాయి. వీటి నిర్వహణకు ఆయా కంపెనీలు పెద్ద మొత్తంలోనే ఖర్చు పెడుతుంటాయి. ఈ సర్వర్లకు లాగిన్ అవడం ద్వారా పని చేసుకునే వెసులుబాటు ఈ కంపెనీల ఉద్యోగులకు ఉంటుంది. దీంతో వీరు ఇంట్లోంచే తమ విధులు నిర్వహించవచ్చు. అయితే చాలా స్టార్టప్ కంపెనీల్లో ఈ స్థాయి సాంకేతికత ఉండదు. చేసేవే కొత్త పనులు, ఒకరి ఆలోచన మరొకరు పంచుకుంటూనే కొన్ని విషయాల్లో గోప్యత పాటించాల్సి ఉంటుంది. ఒక కొత్త ఆలోచన వచ్చిందే తడవు దానిని అమలులో పెట్టే ప్రణాళికలు వేసుకుంటూ ఉండాలి. క్షేత్ర స్థాయిలో ఉండే మార్కెటింగ్ సభ్యులతో అనుసంధానం అవుతూ ఉండాలి. ఇలా ఒక స్టార్టప్ కంపెనీలు ఉన్న పది మంది ఉద్యోగులే.. అన్నీ తామై వంద మంది ఉద్యోగుల పనులు చేస్తూ ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా స్టార్టప్ కంపెనీలు ‘వర్క్ ఫ్రం హోమ్' విధానాన్ని అవలంభించలేవు. అలాగని కార్యాలయాలకూ వెళ్లలేని పరిస్థితి.
కష్టకాలంలోనూ కొన్ని సంస్థల సేవలు...
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ప్రజలంతా స్వీయ నిర్బంధంలో కొనసాగుతున్నారు. నిత్యావసరాలు, ఇతర అత్యవసర వస్తువుల కోసం తప్ప గడప దాటి బయటికి రావడం లేదు. ఈ పరిస్థితి కొన్ని స్టార్టప్లకు మేలే చేస్తోంది. వైద్య రంగం, ఆన్లైన్ పంపిణీ వ్యవస్థలు, ఓటీటీ ప్లాట్ఫాంలు, ఆన్లైన్ పాఠాలు బోధించే స్టార్టప్ కంపెనీలకు గిరాకీ బాగానే ఉంటోంది. స్కూళ్లు, కాలేజీలు బంద్ కావడంతో తమ పిల్లలకు ఆన్లైన్ బోధన జరిపే కొన్ని యాప్లను తల్లిదండ్రులు ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉన్న స్టార్టప్లకు వాటి సేవలను వినియోగించుకునే వారు కూడా పెరిగారు. కాలక్షేపం కోసం అందరూ టీవీలను ఆశ్రయిస్తుండడంతో వీడియో స్ట్రీమింగ్ కంపెనీలకూ గిరాకీ బాగా పెరిగింది.