ఆరంభంలోనే అదరగొట్టిన హోమ్ ఫస్ట్ ఫైనాన్స్..షేరు వాల్యూ ఎంత పెరిగిందంటే..?
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత బుల్ జోరు ఎక్కడా తగ్గడం లేదు. షేర్ మార్కెట్లు అమాంతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని సంస్థలు ఐపీఓలను జారీ చేశాయి. ప్రముఖ హౌజింగ్ ఫైనాన్స్ సంస్థ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ బుధవారం రోజున తొలిసారిగా ఐపీఓలను ఇష్యూ చేసింది. తన షేర్ ప్రీమియం ధరను 19శాతంతో లిస్ట్ చేసింది.
తొలిసారిగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ సంస్థ షేరు ధరను రూ.612.15ని టచ్ చేసింది.బీఎస్ఈపై రూ.518గా ఉండగా అందుకు 19శాతం అధికంతో షేరు వాల్యూను లిస్ట్ చేసింది. దీంతో తొలిరోజున ఈ స్టాక్ బీఎస్ఈపై 639.50 మార్కును తాకగా ఎన్ఎస్ఈ పై రూ.640గా రికార్డు అయ్యింది. ముందుగా లాభాల బాట పట్టిన షేర్ వాల్యూ ఆ తర్వాత క్రమంగా పడిపోయి రూ.565కు చేరింది.
జనవరి 21వ తేదీన జరిగిన హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ షేర్ కొనుగోళ్ల సబస్క్రిప్షన్ సమయంలో ఒక్కో ఈక్విటీ షేర్ వాల్యూ రూ.517 నుంచి రూ.518 మధ్య పలికింది. అయితే అన్ని షేర్లను తొలిరోజునే కొనుగోలు చేయడం జరిగింది. జనవరి 23వరకు షేర్ కొనుగోలు చేసేందుకు గడువు ఉండగా తొలిరోజునే 26.57 రెట్లతో సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. ఇక బుధవారం నాటికి హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ మార్కెట క్యాపిటలైజేషన్ రూ.5,104.70 కోట్లుగా ఉంది.
బెంగళూరుకు చెందిన ఈ గృహరుణాల ఫైనాన్స్ కంపెనీకి వార్బర్గ్ పిన్కస్, ఏత్ మారిషస్, బెస్సెమర్ ఇండియా లాంటి సంస్థల సహకారం ఉంది. 1,153.71 కోట్ల రూపాయల ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) లో తాజాగా రూ .265 కోట్ల వరకు ఇష్యూ మరియు 888.7 కోట్ల రూపాయల అమ్మకం ఆఫర్ ఉన్నాయి. ఇక ఐపీఓ కంటే ముందు ఇన్వెస్టర్ల నుంచి రూ. 346 కోట్లు ఈ సంస్థ సేకరించింది. భవిష్యత్ అవసరాలను తీర్చడానికి సంస్థ తన తాజా ఇష్యూ (రూ. 265 కోట్లలో) నుండి వచ్చే నికర ఆదాయాన్ని వినియోగించనుంది.