యథాతథస్థితి: జగన్ ఆస్తుల కేసులో పెన్నా, పయనీర్ రిసార్ట్స్ జఫ్తుపై హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించిన పెన్నా సిమెంట్స్ కేసులో తెలంగాణ హైకోర్టు గురువారం స్టేటస్ కో విధించింది. పెన్నా ప్రతాప్ రెడ్డి నేతృత్వంలోని పెన్నా సిమెంట్స్, ఎంబసీ రియాల్టర్స్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జఫ్తు చేసింది. ఈ జఫ్తు అంశంలో యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
'భారతి' ఆస్తుల జఫ్తుపై కోర్టు కీలక ఉత్తర్వులు, జగన్ సహా వీరికి నోటీసులు
ఆ సంస్థలకు నోటీసులు
పెన్నా గ్రూప్కు చెందిన పయనీర్ హాలీడే రిసార్ట్స్ హోటల్ జఫ్తుకు సమానమైన మొత్తాన్ని డిపాజిట్ చేయాలని, అయితే ఆస్తిని అన్యాక్రాంతం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. పయనీర్ హోటల్ ఆస్తిని అన్యాక్రాంతం చేయరాదని పెన్నా గ్రూప్కు ఆదేశించింది. పెన్నా గ్రూప్ కంపెనీలకు నోటీసులు జారీ చేసి, విచారణను వాయిదా వేసింది. ఎంబసీ రియాల్టర్స్ ఆస్తుల కేసులో కూడా యథాతథ స్థితిని కొనసాగించాలని ఆ సంస్థకు నోటీసులిచ్చింది.
జఫ్తు చేసిన ఆస్తులు
అక్రమాస్తుల కేసుల విచారణలో భాగంగా అనంతపురం జిల్లా యాడికి మండలంలో పెన్నా సిమెంట్స్కు చెందిన 231 ఎకరాలు, హైదరాబాదులోని పయనీర్ హాలీడే రిసార్ట్స్కు చెందిన హోటల్లో 1,697 చదరపు అడుగులను ఈడీ 2015లో అటాచ్ చేసింది. దీనిపై పెన్నా సిమెంట్స్, పయనీర్ రిసార్ట్స్ ట్రైబ్యునల్ను ఆశ్రయించగా, అప్పీలేట్ ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టుకు ఈడీ
పెన్నా భూముల జఫ్తు కొనసాగినప్పటికీ, హోటల్ స్థలాన్ని విడుదల చేయాలని, దానికి బదులుకు రూ.6 కోట్ల 69 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకోవాలని ఈడీని ట్రైబ్యునల్ ఆదేశించింది. దీనిపై ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. యథాతథ స్థితిని కొనసాగించాలని, అలాగే, వివరణ ఇవ్వాలని పెన్నా సిమెంట్స్, పయనీర్ రిసార్ట్స్కు నోటీసులు జారీ చేసింది.