layoffs: లేఆఫ్ లకు నిజంగా కారణం ఆర్థిక అనిశ్చితేనా ? ఇవి చూసి మీరే డిసైడ్ చేయండి..
layoffs: ప్రతిరోజూ వార్తల్లో క్రమం తప్పకుండా కనిపిస్తున్న ఏకైక టాపిక్ లేఆఫ్ లు. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన భారీ మార్పుల కారణంగా, మాంద్యం భయాల వల్ల పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. కానీ నిజం ఇదేనా, ఆర్థిక మందగమనమే ఈ వరుస ఉద్యోగాల కోతలకు కారణమా ? అని లోతుగా పరిశీలిస్తే.. కాదనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. మరి అసలు కారణాలు ఏమై ఉండొచ్చో అని ఓ ప్రముఖ పత్రిక విశ్లేషించింది. అందులో ఏముందో ఇప్పుడు చూద్దాం..
మైక్రోసాఫ్ట్ మెలిక:
దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అదే సమయంలో వైరల్ అప్లికేషన్ ChatGPTని సృష్టించిన OpenAIలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లు ప్రకటించింది. అంటే దీనిని బట్టి ఉద్యోగులను తొలగించడానికి ఆర్థిక కారణాలేమీ లేవని అర్థం చేసుకోవచ్చు. కేవలం కొత్త వ్యాపార విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు నిధులు అవసరం అయ్యాయి. వాటిని సమీకరించేందుకు ఉద్యోగులపై వేటు వేశారన్నమాట. తొలగించబడిన ఒక్కో ఉద్యోగి ద్వారా 1 మిలియన్ డాలర్లకు సమానమైన మొత్తాన్ని ChatGPTలో పెట్టుబడి పెట్టాలనేది ఆ సంస్థ ప్రణాళికగా తెలుస్తోంది.
ఇదీ గూగుల్ సాకు:
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వర్క్ ఫోర్స్ లో 12 వేల మందిని తగ్గించనున్నట్లు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ప్రకటించింది. అంటే దాదాపు 6 శాతం ఉద్యోగాల్లో కోత విధించారన్నమాట. ఉద్యోగుల తొలగింపును ప్రకటించే క్రమంలో ఆ సంస్థ CEO సుందర్ పిచాయ్.. AIని అత్యంత పరివర్తనాత్మక సాంకేతికతగా అభివర్ణించారు. తమ ప్రతిభను, మూలధనాన్ని అత్యధిక ప్రాధాన్యతలకు మళ్లించడమే తమ వ్యూహంమని పేర్కొన్నారు. ChatGPTకి పోటీగా Google దాని స్వంత AI ఆధారిత టెక్నాలజీని తీసుకొచ్చేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తోంది. అందుకు భారీగా నిధులు కావాలి మరి అవి ఎక్కడ నుంచి వస్తాయి అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
పెద్ద వాటా ఆ నాలుగింటిదే..
ప్రపంచంలోని నాలుగు అతిపెద్ద టెక్ కంపెనీలు మెటా, ఆల్ఫాబెట్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లు కలిసి మొత్తం మీద 50 వేల ఉద్యోగులను తొలగించాయి. కొత్తగా ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన మస్క్.. గతేడాది చివరలో దాదాపు సగం మంది ఉద్యోగులపై వేటు వేశారు. ఈ భారీ కోతలకు నిజమైన కారణం ఏమిటి అని '365 డేటా సైన్స్'కి చెందిన నిపుణులు విశ్లేషించారు. అందులో ఈ క్రింది విషయాలు వెలువడ్డాయి.
టాలెంట్ వార్:
కరోనా సమయంలో టెక్ కంపెనీలు రికార్డు ఆదాయాలతో మంచి ఉత్సాహంగా కనిపించాయి. నియామకాలను సైతం భారీగా చేపట్టాయి. అత్యున్నత ప్రతిభావంతుల కోసం ఆయా సంస్థల మధ్య పోటీ పెరగడంతో.. ఊహించని స్థాయిలో జీతాలు ఇవ్వడానికి సైతం వెనకాడలేదు. తొలగించబడిన ఉద్యోగులను గమనిస్తే.. ఎక్కువ మంది అనుభవం దాదాపు రెండేళ్లు మాత్రమే ఉండటమూ ఇందుకు బలం చేకూరుస్తోంది. అంటే కొవిడ్ కాలంలో కంపెనీలు పాటించిన నియామక విధానంలో లోపాలను గుర్తించి ఇప్పుడు మారడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట.
సింహభాగం మానవ వనరుల విభాగమే:
మొత్తంగా చూస్తే.. తొలగించబడిన ఉద్యోగుల సరాసరి అనుభవం తక్కువ, వీరిని త్వరగా భర్తీ చేయవచ్చు. ఎక్కువ అనుభవంతో అధిక జీతాలు పొందుతున్న వారిని తగ్గించాలని కంపెనీలు భావిస్తున్నాయి. వారి ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి వీలుగా కంపెనీలు కోతలు విధిస్తున్నాయి. సిబ్బందిని తొలగిస్తే, నియామకాలకు అవసరమైన రిక్రూటర్స్ అవసరం ఉండదు. కాబట్టి HR విభాగంపై కోతల ప్రభావం ఎక్కువగా ఉంది. తొలగించబడిన వారిలో కేవలం 10 శాతం మంది మాత్రమే తమ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లో కొత్త ఉద్యోగాన్ని చేర్చారు. అంటే ఈ పరిస్థితి దీర్ఘకాలిక నిరుద్యోగంగా మారే అవకాశం ఉందనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.